ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి స్.. దర్శనం టికెట్లు ఆన్‌లైన్ బుకింగ్స్‌లో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 07:08 PM

తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్స్‌కు సంబంధించి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన 'డయల్ యువర్ ఈవో'లో భక్తుల నుంచి వచ్చిన సూచనలపై స్పందించారు. ఎక్కువమంది భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మూడు నెలలు ముందు ఆన్‌లైన్‌లో విడుదల చేయడం ఇబ్బందిగా ఉందని అంటున్నారని.. ఒక నెల ముందు ఇస్తే బావుంటుందని కొందరు చెబుతున్నారన్నారు. మూడు నెలలు ముందుగా టికెట్లు విడుదల చేస్తే బుక్ చేసుకుని ఓ ప్లాన్ ప్రకారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చనే అభిప్రాయాలు కొందరు భక్తులకు ఉన్నాయన్నారు.


అయితే ఈ రూ.300 టికెట్లను మూడు నెలలు ముందు అయితే కొంతమంది భక్తులు ఇబ్బందిపడుతున్నారన్నారు టీటీడీ ఈవో. గతంలో రైళ్లకు సంబంధించి మూడు నెలలకు ముందే రిజర్వేషన్ చేసుకునేవారని.. అందుకే మూడు నెలలు ముందు తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలకు ఆన్‌లైన్‌లో కోటా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అయితే ఇప్పుడు రైళ్లలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు సంబంధించి మార్పులు చేశారని.. అందుకు తగిన విధంగా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదలకు సంబంధించి కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ దర్శన టికెట్లను 15 రోజులకా, నెలకా, 45 రోజులకా, 2 నెలలకు విడుదల చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కచ్చితంగా ఆన్‌లైన్ దర్శన టికెట్ల విడుదల అంశంపై అధ్యయనం చేసి ఓ నిర్ణయం తీసుకుంటామమని చెప్పారు.


రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్కరోజు ప్రత్యేకంగా విడుదల చేయాలని ఓ భక్తుడు కోరగా.. పరిశీలిస్తామని ఈవో చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్ తో సంవత్సరంలో ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించాలని మరో భక్తుడు కోరగా.. ఇప్పటికే రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్ లైన్ లో, తిరుపతిలో కరెంటు బుకింగ్ ఎస్ఎస్ డి టికెట్లు జారీ చేస్తున్నాం. శ్రీవారి దర్శనానికి వీటిని పొందవచ్చు అని ఈవో తెలిపారు. కాకినాడకు చెందిన మరో భక్తుడు.. 'అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టోకెన్లు మంజూరు చేయండి' అని కోరారు. 'ప్రతిరోజు 16 నుండి 24 వేల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేస్తున్నాం' అని టీటీడీ ఈవో తెలిపారు.


తిరుమల సంప్రదాయానికి విరుద్ధంగా మహిళలు పూలు పెట్టుకు వస్తున్నారని.. తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. భక్తులు అంగప్రదక్షిణ టికెట్ల జారీపై తనను సంప్రదించారని, టిటిడి బోర్డు మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 'వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీచేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణాల వలన రాలేకపోతున్నారు' అని మరో భక్తురాలు కోరారు. 'ఎక్కువ మంది భక్తులకు మేలు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పిన అంశాన్ని పరిశీలిస్తాం' అని ఈవో సమాధానం ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa