ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి ఒక్కొక్కరికీ రూ.15000 ..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 07:01 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో 21 అంశాల మీద మంత్రివర్గం చర్చించింది. అనంతరం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.ఇందులో భాగంగా శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించడానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.15000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. విజయవాడలో సింగ్ నగర్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద సుమారుగా 2 లక్షల 90 వేల మంది లబ్ధిదారులకు రూ.435 కోట్ల మేరకు అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంతో పాటుగా మరికొన్ని ప్రతిపాదనలకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ పాలసీ 2024-29కి సంబంధించిన అనుబంధ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అమృత్ పథకం 2.0 పనులకు, జలవనరుల శాఖకు సంబంధించి పనులకు, కారవాన్‌ పర్యాటకానికి ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను వేగంగా పూర్తి చేసేందుకు గానూ స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి సంస్థలకు భూములు కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు కుష్ఠు వ్యాధి పదం తొలగించేలా చట్టసవరణ చేయాలనే ప్రతిపాదనకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్మిక చట్టాల్లో సవరణలకు, విద్యుత్‌ శాఖ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.


మరోవైపు ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లకు గిరాకీ తగ్గుతోందని.. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారంటూ వారి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా ఉండాలని, ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సేవలో పథకం ప్రారంభించనుంది. గతంలో వాహన మిత్ర పేరుతో ఈ పథకం అమల్లో ఉండేది. వైసీపీ హయాంలో వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10000 అందించేవారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో అని మార్చి... మొత్తాన్ని కూడా రూ.15000 లకు పెంచింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa