ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌పై కేంద్రం రెండు కొత్త నిబంధనలు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 11:20 AM

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన కబురు చెప్పింది. టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ చెల్లింపుల విషయంలో రెండు కీలకమైన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ మార్పుల వల్ల ఫాస్టాగ్ లేని వాహనదారులకు కొంత ఊరట లభించనుంది. కొత్త నిబంధనలు నవంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.ఇప్పటివరకు ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ ప్లాజాల వద్ద సాధారణ రుసుముకు రెట్టింపు మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి ఉండేది. కేంద్రం ఈ నిబంధనను సవరించింది. ఇకపై ఫాస్టాగ్ లేనివారు నగదు రూపంలో చెల్లిస్తే యథావిధిగా రెట్టింపు రుసుము వసూలు చేస్తారు. అయితే, వారికి యూపీఐ ద్వారా చెల్లించే కొత్త అవకాశాన్ని కల్పించారు. యూపీఐ ద్వారా చెల్లింపు జరిపితే సాధారణ రుసుముకు 1.25 రెట్లు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు, సాధారణ టోల్ రూ.100 అనుకుంటే, ఫాస్టాగ్ ఉన్నవారు రూ.100 చెల్లిస్తారు. ఫాస్టాగ్ లేనివారు నగదు ఇస్తే రూ.200, అదే యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.125 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.అదేవిధంగా, ఫాస్టాగ్ ఉన్న వాహనదారులకు కూడా కేంద్రం మరో కొత్త నిబంధనను తీసుకొచ్చింది. వాహనానికి ఉన్న ఫాస్టాగ్ ఖాతాలో తగినంత డబ్బు ఉన్నప్పటికీ, టోల్‌గేట్ వద్ద సాంకేతిక కారణాల వల్ల స్కానింగ్ వ్యవస్థ ఫెయిల్ అయి డబ్బులు కట్ కాకపోతే, ఆ వాహనదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా వెళ్లిపోవచ్చు. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద సిస్టమ్ వైఫల్యాల వల్ల ప్రయాణికులకు కలిగే ఇబ్బందులకు తెర పడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa