ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన మోదీ.. గాజాలో శాశ్వత శాంతికి భారత్ సంపూర్ణ మద్దతు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 08:41 PM

గాజాలో శాంతి స్థాపన దిశగా నిర్ణయాత్మక పురోగతి సాధించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన నాయకత్వాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. హమాస్ తమ అధీనంలో ఉన్న ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో మోదీ ఈ కీలక ప్రకటన చేశారు.


ఈ పరిణామంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గాజాలో శాంతి ప్రయత్నాలకు నిర్ణయాత్మక పురోగతి సాధించినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని అన్నారు. బందీల విడుదలకు లభించిన అంగీకారం శాంతి స్థాపన దిశగా ముందుకు వేసిన ఒక కీలక ముందడుగు అని తెలిపారు. శాశ్వతమైన, న్యాయమైన శాంతి పునరుద్ధరణ కోసం చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ గట్టి మద్దతు ఇస్తూనే ఉంటుందని మోదీ ట్వీట్ చేశారు.


గత రెండేళ్లుగా హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకబోతున్నట్లు బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ప్రవేశ పెట్టిన శాంతి ప్రణాళికను అంగీకరించకపోతే అంతా నరకమే చూడాల్సి వస్తుందన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన గట్టి హెచ్చరికల నేపథ్యంలో.. హమాస్ మెట్టు దిగింది. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్‌ బందీలను వదిలి పెట్టడానికి సిద్ధమైంది. అయితే అందుకు బదులుగా గాజాపై నెతన్యాహు సేనలు వెంటనే దాడులు ఆపాలని హమాస్ డిమాండ్ చేసింది. ట్రంప్ సూచించిన ప్రతిపాదనల్లో కొన్నింటిని అంగీకరించిన హమాస్.. మిగిలిన అంశాలపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ మేరకు మధ్యవర్తులతో తక్షణమే చర్చలు ప్రారంభిస్తామని హమాస్ వెల్లడించింది.


అంతేకాకుండా గాజా పరిపాలనను పాలస్తీనా టెక్నోక్రాట్స్‌కు అప్పగించేందుకు సిద్ధమని కూడా హమాస్ ప్రకటించింది. ఈ శాంతి ప్రణాళికకు మద్దతు ఇస్తున్న అరబ్, ఇస్లామిక్ దేశాలతో పాటు అంతర్జాతీయ భాగస్వాములకు, డొనాల్డ్ ట్రంప్‌నకు హమాస్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ తాజా పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ కూడా తన సామాజిక మాధ్యమం 'ట్రూత్'లో స్పందించారు. శాంతి నెలకొల్పేందుకు హమాస్ సిద్ధంగా ఉన్నట్లు తాను నమ్ముతున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాజాలో దాడులను ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని సూచించారు. అలా చేస్తేనే బందీలను క్షేమంగా, త్వరగా విడిపించవచ్చని పేర్కొన్నారు.


దాడులు కొనసాగితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. "పరిష్కరించాల్సిన అంశాలపై మేము ఇప్పటికే చర్చలు జరుపుతున్నాం. ఇది కేవలం గాజా గురించి మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలో చాలా కాలంగా కోరుకుంటున్న శాంతి గురించి" అంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ పరిణామాలు త్వరలోనే ఈ సుదీర్ఘ యుద్ధానికి తెర దించుతాయనే ఆశాభావాన్ని రేకెత్తిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa