పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందినా ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే ఈ దారుణం జరిగిందని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనకు నైతిక బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "కురుపాం గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవ్వడంతో విద్యార్థులు కలుషిత నీరు తాగారు. దీనివల్ల పచ్చకామెర్లు సోకి కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మరో ఎంతోమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. 611 మంది చదువుతున్న పాఠశాలలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు" అని విమర్శించారు. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నిస్తూ, "ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు గిరిజన, పేద పిల్లల ప్రాణాలంటే అంత చులకనా" అని నిలదీశారు.తమ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలను గుర్తు చేస్తూ, "పేదల తలరాతను మార్చేది చదువేనని నమ్మి, 'నాడు-నేడు' ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దేవాలయాలుగా మార్చాం. కరెంటు, ఫ్యాన్లు, ఫర్నిచర్, డిజిటల్ ప్యానెళ్లు, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు వంటి 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం. పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాం" అని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రైవేటు సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను క్రమంగా నాశనం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. "ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, టోఫెల్ శిక్షణ, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు, గోరుముద్ద వంటి పథకాలన్నింటినీ దెబ్బతీశారు. మీ దుర్మార్గాల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు గురైతే పట్టించుకునే నాథుడే లేడు. హాస్టళ్లలో విషాహారం తినడం, అనారోగ్యం పాలవడం సాధారణమైపోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నిర్లక్ష్యమే కురుపాం బాలికల ఉసురు తీసిందని పేర్కొన్న జగన్, ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరవాలని హితవు పలికారు. పాఠశాలల్లో వసతులపై, విద్యార్థుల ఆరోగ్యంపై వెంటనే శ్రద్ధ పెట్టాలని సూచించారు. మరణించిన విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణమే రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టే ఈ పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa