ఏపీలో నకిలీ మద్యం కేసు కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమవుతోంది. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్దేపల్లి జనార్ధన్ మీద కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అద్దేపల్లి జనార్ధన్ మీద ఏపీ ఎక్సైజ్ శాఖ కేసు నమోదు చేసింది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉన్న ఏఎన్ఆర్ బార్ను భవానీపురం ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు మందుబాబులను ఈ కల్తీ మద్యం వ్యవహారం భయపెడుతోంది. ఇబ్రహీంపట్నంలోని ఓ గోడౌన్లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటివే మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. గోడౌన్లో భారీగా మద్యం బాటిళ్లు లభ్యం కావటంతో.. కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కల్తీ మద్యం కీలక సూత్రదారి అద్దేపల్లి జనార్ధన్తో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారుల దృష్టి సారించారు. ఈ క్రమంలోనే అద్దేపల్లి జగన్మోహన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మరోవైపు అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసు వ్యవహారంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎవరైనా వదలొద్దని.. కఠినచర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు.. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలకు ఇబ్బందిపెట్టే నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం మీద చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆఫ్రికాలో ఉన్న జనార్ధన్..
నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్ధన్కు విజయవాడలో ఓ బార్ ఉంది. అక్కడ అతని పేరు మీద బార్ లైసెన్స్ ఉంది. అయితే కల్తీ మద్యం కోసమే జనార్ధన్ అన్నమయ్య జిల్లా ములకలచెరువు వచ్చినట్లు సమాచారం. ఈ సరుకును పెద్దతిప్పసముద్రంలోని ఓ వైన్స్ షాపునకు, అలాగే ములకలచెరువులో ఉన్న మరో వైన్స్ షాపునకు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. నాలుగురోజుల కింద జనార్ధన్ దక్షిణాఫ్రికాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. జనార్ధన్తో పాటుగా స్థానిక లీడర్ జయచంద్రారెడ్డి పాత్రపైనా విచారణ జరుపుతున్నారు.
ఎలా తెలిసిందంటే..
ములకలచెరువులో నకిలీ మద్యం బాటిళ్లతో ఇటీవల కొంతమంది అధికారులకు దొరికారు. దీంతో తీగలాగగా.. డొంక కదిలింది. కదిరి సమీపంలో నకిలీ మద్యం తయారీ చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు.. కేంద్రంపై దాడులు నిర్వహించారు. నకిలీ మద్యం తయారీలో భాగస్వామ్యం ఉన్న 14 మందిని గుర్తించిన పోలీసులు.. వారిలో 10 మందిని అరెస్టు చేశాం.ఈ మద్యం తయారీ కేంద్రాన్ని అద్దేపల్లి జనార్దన్ రావు నిర్వహిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనితో పాటుగా ములకలచెరువులోని వైన్స్ షాపు లైసెన్స్ ఉన్న రాజేష్, రాజు, శ్రీనివాసరావు అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa