ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరెస్టు శిఖరంపై మంచు తుఫాను.. చిక్కుకుపోయిన 1000 మందికిపైగా పర్వతారోహకులు

international |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 09:21 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అయిన ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. ఫలితంగా వేల అడుగుల ఎత్తులో దాదాపు 1000 మందికి పైగా పర్వతారోహకులు మంచు శిఖరంపై చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వ మీడియా వర్గాలు వెల్లడించాయి. అలాగే వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు సహాయక చర్యలు చేపట్టినట్లు కూడా వెల్లడించారు.


టిబెట్‌లో ఎవరెస్ట్ పర్వతం తూర్పువాలు వైపు శుక్రవారం రోజు సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. అయితే ఇది కాస్తా ఆదివారం నాటికి మంచి తుఫానుగా మారిపోయింది. దీంతో దాదాపు 1000 మంది క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు. విషయం గుర్తించి అధికారులు, స్థానిక ప్రజలు వెంటనే స్పందించారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 350 మందిని రక్షించి.. సురక్షితంగా క్యుడాంగ్ అనే చిన్న పట్టణానికి తరలించారు. అలాగే సముద్ర మట్టానికి 4,900 మీటర్ల (16,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో పేరుకుపోయిన మంచును తొలగించడానికి, దారిని సుగమం చేయడానికి వందలాది మంది స్థానిక గ్రామస్థులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.


సాధారణంగా ఈ ప్రాంతం అంతా పర్వతారోహకులు, హైకింగ్‌కు వచ్చే సందర్శకులతో కిక్కిరిసి ఉంటుంది. ప్రస్తుతం చైనాలో సెలవులు కావడంతో.. ఇది మరింత రద్దీగా ఉంది. అయితే ఈ సమయంలోనే తుఫాను రావడంతో వీరంతా పర్వతంపైనే చిక్కుకుపోయారు. చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో.. హైకర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే కొంత మంది హైకర్లు హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందం వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు.


క్యుడాంగ్ పట్టణానికి చేరుకోగలిగిన ట్రెక్కింగ్ బృందంలో భాగమైన చెన్ గెషువాంగ్ మాట్లాడుతూ.. "వాతావరణం చాలా తడిగా, చల్లగా ఉంది. హైపోథర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం) నిజంగా పెద్ద ప్రమాదంగా పరిణమించింది" అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది వాతావరణం అస్సలు సాధారణంగా లేదని అన్నారు. తన జీవితంలోనే.. అక్టోబర్ నెలలో ఇంతటి విపరీతమైన వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని తమ గైడ్ చెప్పినట్లు వెల్లడించారు. ఇదంతా చాలా ఆకస్మికంగా జరిగిందని ఆయన వెల్లడించారు.


ప్రస్తుతం ఈ ప్రాంతమంతా అత్యంత విపరీతమైన వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. పొరుగున ఉన్న నేపాల్‌లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడం, ఆకస్మిక వరదలు రావడంతో వంతెనలు కొట్టుకుపోయాయి. గత రెండు రోజుల్లో అక్కడ కనీసం 51 మంది మరణించినట్లు సమాచారం. చైనాలో కూడా టైఫూన్ మాట్మో తీరాన్ని తాకడంతో.. సుమారు 1,50,000 మంది ప్రజలను వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa