ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ని అడ్డంకులు సృష్టించినా రోడ్డు మార్గంలోనే జగన్ పర్యటన ఖాయమన్న అమర్‌నాథ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 08:51 PM

జగన్ చేపట్టనున్న మాకవరపాలెం పర్యటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 9వ తేదీన విశాఖపట్నం నుంచి నర్సీపట్నం సమీపంలోని మాకవరపాలెం వద్ద మెడికల్ కాలేజీని సందర్శించేందుకు జగన్ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు సిద్ధమవ్వగా, పోలీసులు ఆంక్షలు విధించడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపిస్తోంది.షెడ్యూల్ ప్రకారం, జగన్ అక్టోబర్ 9న ఉదయం 10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే, అదే రోజు విశాఖ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఉన్నందున, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ విశాఖపట్నం సిటీ పోలీసులు, అనకాపల్లి ఎస్పీ ఈ పర్యటనకు రోడ్డు మార్గంలో అనుమతి నిరాకరించారు. వర్షాకాలం కావడంతో ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నానికి హెలికాప్టర్‌లో వెళ్లాలని సూచించారు.పోలీసుల నిర్ణయంపై మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. తాము పర్యటన కోసం పోలీసుల అనుమతి కోరలేదని, కేవలం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన నాయకుడి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేయాలని మాత్రమే సమాచారం ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల పర్యటనలకు ఎలాంటి ఆటంకాలు కల్పించలేదని గుర్తుచేశారు. ఇప్పుడు అడగకుండానే హెలికాప్టర్‌లో రమ్మని చెప్పడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో నెల్లూరు పర్యటనకు వెళ్లినప్పుడు మూడుసార్లు హెలిప్యాడ్ అనుమతులు నిరాకరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడానికే జగన్ వస్తున్నారని అమర్‌నాథ్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు తమ సమస్యలను జగన్‌కు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని అడ్డుకోవడానికే ప్రభుత్వం ఈ ఆంక్షల నాటకమాడుతోందని ఆరోపించారు. ఒక ప్రజా నాయకుడిని, మాజీ సీఎంను ప్రజలను కలవకూడదని చెప్పడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. గత 15 నెలలుగా జగన్ పర్యటనలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని, ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని హెచ్చరించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అనుకున్న ప్రకారం వైఎస్ జగన్ రోడ్డు మార్గంలోనే నర్సీపట్నం వెళ్లి ప్రజలను కలుస్తారని గుడివాడ అమర్‌నాథ్ తేల్చిచెప్పారు.పోలీసు ఆంక్షలు అనవసరమని, సజావుగా జరగాల్సిన కార్యక్రమాన్ని పెద్దది చేసి రాద్ధాంతం చేయవద్దని గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగన్ ను కలవడానికి వచ్చే వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం జగన్‌కు తగిన బందోబస్తు, సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తే, తాము కూడా సహకరిస్తామని గత మూడు రోజులుగా పోలీసులతో చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.మెడికల్ కాలేజీ పర్యటనకు ఏపీఎంఎస్ఐడీసీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం సమాచారం అందిస్తే సరిపోతుందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa