ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పైలట్ల శిక్షణ విషయంలో కీలక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇండిగో సంస్థకు డీజీసీఏ రూ. 20 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం, కేటగిరీ-సి ఏరోడ్రోమ్లలో పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు నిర్దేశిత ప్రమాణాలు కలిగిన సిమ్యులేటర్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సెప్టెంబర్ 26న తమకు ఈ మేరకు డీజీసీఏ నుంచి ఆదేశాలు అందినట్లు కంపెనీ తన ఫైలింగ్లో వెల్లడించింది.అయితే డీజీసీఏ విధించిన ఈ జరిమానాపై ఇండిగో స్పందించింది. ఈ ఆదేశాలను తాము అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ జరిమానా వల్ల కంపెనీ ఆర్థిక వ్యవహారాలు, కార్యకలాపాలు లేదా ఇతర వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కూడా వివరించింది.డీజీసీఏ నుంచి ఆదేశాలు అంది చాలా రోజులు గడుస్తున్నా ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలో జరిగిన జాప్యంపై కూడా కంపెనీ వివరణ ఇచ్చింది. ఉత్తర్వులకు సంబంధించిన వివరాలు తమ అంతర్గత విభాగాల మధ్య చేరడంలో ఆలస్యం కావడం వల్లే ఈ జాప్యం జరిగిందని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పేర్కొంది. కాగా, ఈ వార్తల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో బుధవారం ఇండిగో షేరు విలువ 0.59 శాతం తగ్గి రూ. 5,630.50 వద్ద ముగిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa