ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్, ఎలాన్ మస్క్, ఇమ్రాన్ ఖాన్.. పోటీలో 338 మంది

international |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 08:54 PM

2025 ఏడాదికి గానూ నోబెల్ బహుమతుల ప్రకటన ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో నోబెల్ పురస్కారానికి ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందరి చూపు నోబెల్ శాంతి బహుమతిపై పడింది. ఈ విభాగంలో ఎవరికి అవార్డు దక్కుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా నోబెల్‌ శాంతి బహుమతి కోసం పోటీ పడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్రంప్‌తో పాటు ఈ బహుమతి కోసం 338 అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అందలో 244 వ్యక్తులతో పాటు 94 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. గతేడాది శాంతి బహుమతికి 286 నామినేషన్లు రావడం గమనార్హం.


నోబెల్ కమిటీ అధికారికంగా నామినీల పేర్లు ప్రకటించకున్నా.. కొంత మంది ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పోప్ ఫ్రాన్సిస్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉండటం గమనార్హం.


డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానాతంటాలు పడుతున్నారు. అనేక సార్లు తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు. తాను అనేక యుద్ధాలు ఆపినట్లు చెబుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. కొన్ని సార్లు సృష్టించుకుని మరీ.. తనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వాలో చెప్పుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, కంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్.. అమెరికా అధ్యక్షుడిని శాంతి బహుమతి కోసం నామినేట్ చేశారు. అయితే 2025 ఫిబ్రవరి 1న ముగిసిన గడువు తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని, పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన నామినేషన్లు చేయడం గమనార్హం.


ఈసారైనా ట్రంప్‌కు నోబెల్ దక్కుతుందా..


డొనాల్డ్ ట్రంప్‌ నోబెల్ నామినేషన్లు.. ఇప్పటికే మూడుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. 2018, 2020 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక 2024లో దాదాపు ఆరు వరకు నామినేషన్లు రాగా.. అప్పుడు కూడా ట్రంప్‌ను నోబెల్ వరించలేదు.


మిగతా ప్రముఖులు వీళ్లే..


పోప్ ఫ్రాన్సిస్


ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించిన పోప్ ఫ్రాన్సిస్ కూడా నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. నార్వేలోని క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన డాగ్ ఇంగే ఉల్‌స్టెయిన్.. దివంగత పోప్‌ను నామినేట్ చేశారు. కానీ ఇప్పటివరకైతే నోబెల్ బహుమతిని మరణానంతరం ఎప్పుడూ ఇవ్వలేదు.


పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..


ప్రస్తుతం జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను.. పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (PWA), నార్వేజియన్ రాజకీయ పార్టీ పార్టియెట్ సెంట్రమ్ సభ్యులు నామినేట్ చేశారు.


ఎలాన్ మస్క్..


బిలియనీర్ ఎలోన్ మస్క్ కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రాన్ని సమర్థిస్తూ, కాపాడుతున్నందుకు స్లోవేనియాకు చెందిన యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ నామినేట్ చేశారు.


మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం


మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంను.. ప్రొఫెసర్ డాక్టర్ దాతుక్ ఉస్మాన్ బకర్, ప్రొఫెసర్ డాక్టర్ ఫార్ కిమ్ బెంగ్ నామినేట్ చేశారు. థాయిలాండ్-కంబోడియా కాల్పుల విరమణలో అన్వర్ పాత్రను వారు ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa