ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 08:55 PM

ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.గురువారం రోజున అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాలు మినహా దాదాపు అన్నిచోట్లా పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని వివరించారు.ఇక రాబోయే మూడు గంటల్లో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa