ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీసీసీఐ జట్టుని 'భారత జాతీయ క్రికెట్ జట్టు' అనడానికి వీల్లేదు అని వేసిన వ్యాజ్యం కొట్టివేత

national |  Suryaa Desk  | Published : Wed, Oct 08, 2025, 09:27 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలోని జట్టును 'భారత జాతీయ క్రికెట్ జట్టు'గా పిలవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం, ఇలాంటి వాటితో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని హితవు పలికింది.ప్రభుత్వ ఆధీనంలోని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వంటి ప్రసార సంస్థలు బీసీసీఐ జట్టును 'టీమిండియా'గా పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది రీపక్ కన్సల్ ఈ పిల్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది."ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న ఆ జట్టు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదని మీరు చెబుతున్నారా? బీసీసీఐని పక్కనపెట్టండి... దూరదర్శన్ లేదా మరేదైనా సంస్థ ఆ జట్టును టీమిండియాగా చూపిస్తే, అది భారత జట్టు కాకుండా పోతుందా?" అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం ఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసా అని కూడా ధర్మాసనం గుర్తుచేసింది. ఈ వ్యాజ్యం విచారణకు స్వీకరించడం పూర్తిగా సమయం వృథా చేయడమేనని అభిప్రాయపడింది. "ఇకపై మంచి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయండి" అని పిటిషనర్‌కు సూచిస్తూ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa