దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా లాభాలతో ముగిశాయి. ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్లు జరగడంతో పాటు ఆటో, ఎనర్జీ షేర్లు కూడా రాణించడంతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 82,501 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 25,285 వద్ద ముగిసింది.ఈ ఉదయం ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభమైంది. ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు నష్టపోయి 82,075 వద్ద మొదలైంది. అయితే, కొద్దిసేపటికే కోలుకుని ఇంట్రాడేలో 579 పాయింట్ల వరకు లాభపడి 82,654 గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్ సమయంలో 25,331 గరిష్ఠాన్ని నమోదు చేసింది.సెన్సెక్స్ ప్రధాన షేర్లలో ఎస్బీఐ 2 శాతానికి పైగా లాభపడగా, మారుతీ సుజుకి, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ షేర్లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు, టాటా స్టీల్ 1.5 శాతం నష్టపోగా, రెండో త్రైమాసిక ఫలితాల తర్వాత టీసీఎస్ షేరు సుమారు 1 శాతం క్షీణించింది.రంగాల వారీగా చూస్తే, బీఎస్ఈ హెల్త్కేర్, బ్యాంకెక్స్ సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ సూచీలు అరశాతం మేర పెరిగాయి. ఇక బ్రాడర్ మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు, భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపు కావచ్చన్న వార్తలతో టెక్స్టైల్ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 17 శాతం వరకు దూసుకుపోయాయి.అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సానుకూల అంచనాలు, మధ్యప్రాచ్యంలో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం వంటి అంతర్జాతీయ అంశాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయని విశ్లేషకులు తెలిపారు. పండుగ సీజన్ ప్రారంభంలో జీఎస్టీ సంస్కరణల కారణంగా వినియోగం పెరగడం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలతో దేశీయ ఆర్థిక సూచికలు మెరుగుపడటం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా నిఫ్టీ రానున్న రోజుల్లో 25,500 - 25,550 స్థాయిలకు చేరే అవకాశం ఉందని, 25,150 వద్ద మద్దతు లభిస్తుందని వారు అంచనా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa