ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌కి దక్కని నోబెల్‌ శాంతి బహుమతి.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైట్‌హౌస్‌

international |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:30 PM

నోబెల్‌ శాంతి బహుమతిపై భారీ ప్రచారం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని వెనెజులా హక్కుల కోసం పోరాడిన విపక్ష నేత మరియా కొరీనా మచోడాను కమిటీ ఎంపిక చేసింది. తాజాగా, దీనిపై అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ స్పందిస్తూ.. విమర్శలు గుప్పించింది. విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని ఆరోపించింది. శ్వేతసౌధం కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ స్టీవెన్‌ చుయెంగ్‌ ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)‌లో పోస్ట్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా నోబెల్ శాంతి బహుమతిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే.


‘‘నోబెల్‌ అవార్డుల కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత ప్రదర్శించిన వారిని పక్కనబెట్టి రాజకీయ వివక్షను కొనసాగించింది.. అయినప్పటికీ మా అధ్యక్షుడు యుద్ధాలను ఆపేందుకు తనవంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు.. శాంతి ఒప్పందాలతో ప్రజల ప్రాణాలు కాపాడుతారు.. ఆయన ఓ గొప్ప మానవతావాది. తన సంకల్పంతో పర్వతాలను కదిలించే ఆయనలాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు’’ అని చుయెంగ్ నోబెల్ అవార్డు ఎంపిక కమిటీని బహిరంగంగానే విమర్శించారు.


మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతుదారు ‘మాగా వాయిస్‌’ కూడా దీనిపై స్పందించింది. ‘‘నోబెల్‌ శాంతి బహుమతి ఓ జోక్‌ అయిపోయింది.. తెలివి ఉన్నవారు డొనాల్డ్ ట్రంప్‌కే నోబెల్‌ శాంతి బహుమతి రావాల్సిందని అనుకుంటారు’’ అని విమర్శలు చేసింది.


అటు, ట్రంప్‌ను శాంతి బహుమతికి ఎంపికచేయకపోవడంపై నోబెల్ అవార్డుల కమిటీ ఛైర్మన్‌ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్‌ వివరణ ఇచ్చారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా విజేతలను ఎంపిక చేస్తామని తెలిపారు. ‘‘మీడియా, బహిరంగ ప్రచారాలను కమిటీ గమనిస్తోంది. నోబెల్‌ అవార్డు విజేతల ఫోటోలు ఉన్న గదిలో కూర్చుని ఆ లేఖలను మేం పరిశీలిస్తాం... ఆ గది మాకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. సమగ్రతతో పనిచేసే సంకల్పాన్ని అందిస్తుంది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం’’ అని వెల్లడించారు.


కాగా, డొనాల్డ్ ట్రంప్‌ నోబెల్‌ కల ఇప్పటిది కాదు. గతంలోనూ అనేకసార్లు తన ఆకాంక్షను ఆయన బయటపెట్టారు. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నోబెల్‌ శాంతి బహుమతి తనకు వచ్చి తీరాల్సిందే అన్న స్థాయిలో ప్రచారం మొదలుపెట్టారు. ఏడు నుంచి ఎనిమిది యుద్ధాలను ఆపానని, తనకంటే ప్రపంచ శాంతిని కోరుకుంటున్న వ్యక్తి ఎవరూ లేరని, నోబల్ తనకే ఇవ్వాలని బహిరంగ ప్రకటనలు గుప్పించారు. ఎన్ని మంచి పనులు చేసినా.. నోబెల్‌ పురస్కారం మాత్రం తనకు ఇవ్వరంటూ ఒకానొక సందర్భంలో అమెరికా అధ్యక్షుడు తన అక్కసును వెళ్లగక్కారు. కానీ, ఇవేమీ నోబెల్‌ అవార్డుల ఎంపిక కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa