దేశంలో కల్తీ దందా వికృతరూపం దాల్చింది. నిత్యవసరాలు, ఆహార పదార్థాల నుంచి ఔషధాల వరకు, చివరకు మన రోజువారీ వినియోగ వస్తువుల్లోనూ కల్తీ పడగ విప్పుతోంది. ఇప్పటివరకు పాలు, మద్యం, నిత్యవసర వస్తువులు కల్తీ అవ్వడం చూశాం. తాజాగా, టూత్పేస్ట్ దిగ్గజ బ్రాండ్ అయిన కోల్గేట్ నకిలీ తయారీ కేంద్రాల గుట్టురట్టు కావడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో పనీర్, సెన్సోడైన్ వంటి వైద్య-ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు, ఈనో వంటి సాధారణ వస్తువులు కూడా కల్తీ అయిన సంఘటనలు వెలుగుచూశాయి. ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, నేరుగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే అంశంగా మారింది.
కల్తీకి గురవుతున్న ఈ ఉత్పత్తుల తయారీలో రసాయనాలు, నాసిరకం, హానికారక పదార్థాలు ఉపయోగిస్తున్నారు. ఇవి ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయి. ఉదాహరణకు, పళ్ల పేస్టులో కల్తీ జరగడం అంటే, మనం ప్రతిరోజూ నోటిలో ఉపయోగించే వస్తువు ద్వారా తెలియకుండానే ప్రమాదకరమైన రసాయనాలను లోపలికి తీసుకుంటున్నట్లే. ఆహార పదార్థాల్లో అయితే, అనారోగ్యం పాలయ్యే ప్రమాదం తక్షణమే ఉంటుంది. మెడిసిన్ కల్తీ కేసుల్లో మరణాల ముప్పు కూడా పొంచి ఉంది. ఇటువంటి సంఘటనలు వినియోగదారుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
ఏది కల్తీదో, ఏది నిజమైనదో గుర్తించలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్యాకేజింగ్ దాదాపుగా ఒరిజినల్ను పోలి ఉండడం, అతి తక్కువ ధరలకు లభించడంతో సామాన్య ప్రజలు సులభంగా మోసపోతున్నారు. ఈ కల్తీ మాఫియా కేవలం చిన్న చిన్న వ్యాపారస్తులకే పరిమితం కాకుండా, గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున ఈ దందాను నిర్వహిస్తోంది. ఇది, కేవలం చట్టపరమైన లోపమా లేక పర్యవేక్షణ కొరత వలన జరుగుతోందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎంతో విశ్వసనీయత ఉన్న బ్రాండ్లకు కూడా కల్తీ బెడద తప్పకపోవడం దేశంలో కల్తీ నియంత్రణ వ్యవస్థ పటిష్టతపై సందేహాలను పెంచుతోంది.
ఈ కల్తీని అరికట్టడానికి కేవలం దాడులు, అరెస్టులు మాత్రమే సరిపోవు. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే ఇటువంటి నేరాలపై కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, ఆహార-ఔషధ నియంత్రణ సంస్థలు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలి. అదేవిధంగా, వినియోగదారులు కూడా కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత, ప్యాకేజింగ్ వివరాలపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. ఏది ఏమైనా, దేశంలో పెరుగుతున్న కల్తీ దందా ప్రజారోగ్యానికి అతిపెద్ద సవాలుగా మారిందని చెప్పక తప్పదు. ఈ ముప్పును ఎదుర్కొనడానికి ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa