ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-అమెరికా మధ్య రానున్న రోజుల్లో భాగస్వామ్యం పెరగనుంది

international |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 04:55 PM

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక నూతన శకం ప్రారంభమైందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వమే కారణమని భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న 38 ఏళ్ల గోర్, అమెరికా చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన రాయబారిగా రికార్డు సృష్టించారు. అధికారికంగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ, కీలక సమావేశాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.అక్టోబర్ 9న ఢిల్లీ చేరుకున్న సెర్గియో గోర్, తన ఆరు రోజుల పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలతో సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధన భద్రతకు అవసరమైన కీలక ఖనిజాల వంటి అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా, ట్రంప్ పంపిన ఒక ప్రత్యేక బహుమతిని గోర్ ప్రధాని మోదీకి అందించారు. గతంలో వైట్‌హౌస్‌లో ఇరువురు నేతలు కలుసుకున్నప్పటి ఫొటోపై "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు గొప్పవారు" అని ట్రంప్ స్వయంగా రాసి సంతకం చేసి పంపారు.సమావేశం అనంతరం గోర్ మాట్లాడుతూ, "ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా జరిగింది. భారత్‌తో ఉన్న బంధాన్ని అమెరికా ఎంతో విలువైనదిగా భావిస్తుంది.  అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీని ఒక గొప్ప, వ్యక్తిగత మిత్రుడిగా భావిస్తారు. నేను ఢిల్లీ బయలుదేరడానికి ముందు కూడా ఇద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. వారి మధ్య ఈ సంప్రదింపులు రానున్న రోజుల్లోనూ కొనసాగుతాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను," అని తన అధికారిక ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa