బిహార్ శాసనసభ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చింది. మొత్తం 243 స్థానాలకు గానూ నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ చెరో 101 సీట్లలో పోటీచేయనున్నాయి. మిగతా 41 స్థానాల్లో చిరాగ్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్జన శక్తికి 29, జీతన్రామ్ మాంఝీ పార్టీ హిందూస్థాన్ అవామీ మోర్చా, ఉపేంద్ర కుష్వాహ పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చాలకు చెరో ఆరు చొప్పున కేటాయించినట్టు కేంద్ర మంత్రి, బిహార్ ఎన్నికల బీజేపీ ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి.
చిరాగ్ పాశ్వాన్ తనకు 40 నుంచి 45 స్థానాలు కావాలని పట్టుబట్టినా.. బీజేపీ మాత్రం 25 కంటే ఎక్కువ ఇచ్చేదిలేదని తేల్చిచెప్పింది. దీంతో బీజేపీని బెదిరించడానికి ప్రశాంత్ కిషోర్ పార్టీ జనసూరజ్తో పొత్తుకు ప్రయత్నిస్తున్నామనే సంకేతాలను కూడా ఆ పార్టీ వర్గాలు ఇచ్చాయి. బిహార్ బీజేపీ ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్.. చిరాగ్ పాశ్వాన్తో పలుసార్లు భేటీ అయి, బుజ్జగించారు. దీంతో చిరాగ్ తన స్టాండ్ మార్చుకుని, 29 సీట్లు అంగీకరించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 6, 11న రెండు దశల్లో నిర్వహించి, ఓట్లను నవంబరు 14న లెక్కించి, ఫలితాలను అదే రోజు వెల్లడించనున్నారు. తొలిదశ ఎన్నికలకు అక్టోబరు 10న నోటిఫికేషన్ విడుదల కాగా.. నామినేషన్కు చివరి తేదీ అక్టోబరు 17. రెండో దశ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నామినేషన్కు చివరి తేదీ అక్టోబరు 20.
అటు, ఇండియా కూటమిలో కూడా సీట్ల సర్దుబాటుపై భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీకి 130కి తక్కువ కాకుండా పోటీచేయనుందని తెలుస్తోంది. మిగతా 110 సీట్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా ఇతర మిత్రపక్షాలు పోటీ చేయనున్నాయి. గత ఎన్నికల్లో 78 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినా.. ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి, అధికారం నిలుపుకుంది. ఈసారి ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకుంది. యువ ఓటర్లలో తేజస్వీ యాదవ్కు మంచి ఆదరణ ఉన్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటర్ అధికార యాత్ర పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రచారం కూడా విజయవంతమైంది. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు విమర్శలు వెల్లువెత్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa