ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డీమార్ట్‌కు 3 నెలల్లోనే వందల కోట్ల లాభం.. ఆదాయం వేల కోట్లు

business |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 08:47 PM

భారతదేశంలోని ప్రజలకు.. ముఖ్యంగా సిటీల్లో ఉండే వారికి డీమార్ట్ గురించి తెలిసే ఉంటుంది. ఇది కిరాణా కింగ్‌గా పేరుగాంచింది. సామాన్యులు సహా ధనవంతులు కూడా కిరాణా సామగ్రి నుంచి ఫర్నీచర్, దుస్తులు, ఫుట్‌వేర్ ఇతర అన్ని రకాల వస్తువుల కోసం డీమార్ట్‌ను సందర్శిస్తుంటారు. ఎప్పుడూ జనం తాకిడి ఉంటుంది. శని, ఆదివారాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కిరాణా సామగ్రి.. పప్పులు, ఉప్పులు, ఆయిల్ ప్యాకెట్లు, డైరీ ప్రొడక్ట్స్, ఫర్నీచర్, ఫుట్‌వేర్, డ్రెస్సెస్, స్టీల్ సామగ్రి ఇలా ఇంట్లో అవసరమయ్యే వస్తువుల్లో మెజార్టీ ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి డీమార్ట్‌ స్టోర్లు దేశవ్యాప్తంగా వందల్లో ఉంటాయి. ఇక్కడ లాభాలు ఎలా వస్తాయో మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా.. తెలుసుకోవాలన్నా కోరిక కలిగిందా..? అయితే ఇది మీకోసమే.


డీమార్ట్ రిటైల్ చెయిన్స్ నిర్వహిస్తున్న దాని మాతృ సంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్.. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల్ని తాజాగా విడుదల చేసింది. ఈ జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో సంస్థ నికర లాభం 3.9 శాతం పెరిగి రూ. 684.8 కోట్లుగా నమోదైంది. అంటే 3 నెలల్లో ఇంత లాభం వచ్చిందన్నమాట. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ. 659.4 కోట్లుగా ఉండేది. లాభం ఇక్కడ కాస్త పెరిగింది.


ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం ఇదే 3 నెలల కాలంలో 15.4 శాతం పెరిగి రూ. 16,676.3 కోట్లుగా వచ్చింది. అంతకుముందు అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబరులో ఇది రూ. 14,444.5 కోట్లుగా ఉండేది. ఇక అవెన్యూ సూపర్‌మార్ట్స్ మొత్తం వ్యయాలు 16 శాతం పెరిగి రూ. 15,751.08 కోట్లుగా ఉంది. ఈ ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న రిటైలర్.. జులై- సెప్టెంబరులో కొత్తగా 8 స్టోర్లను యాడ్ చేస్కొని.. మొత్తం సంఖ్యను 432 స్టోర్లకు చేర్చుకుంది.


కంపెనీ ప్రకటన ప్రకారం.. ఇక్కడ పాత స్టోర్లలోనే వృద్ధి ఎక్కువగా ఉంది. అంటే కొత్త స్టోర్లలో ఇంకా అంతగా ఆదాయం రాట్లేదని వెల్లడించింది. ఇక తమ మొత్తం ఆదాయంలో 57 శాతం వరకు.. ఫుడ్, గ్రాసరీ ప్రొడక్ట్స్ ఉన్నట్లు తెలిపింది. జనరల్ మర్చండైజ్, దుస్తుల వాటా 19.7 శాతం, నాన్ ఫుడ్ ఎఫ్ఎంసీజీ వాటా 20.2 శాతంగా ఉంది.


డీమార్ట్ షేర్ ప్రైస్..


ఇక క్యూ1లోనూ అద్భుత ఫలితాలు సాధించినప్పటి నుంచి డీమార్ట్ షేర్ ధర దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 4,328 గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 21 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2.81 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 4,949.50 కాగా.. కనిష్ట ధర రూ. 3,340 గా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa