బంగారం ధరలు చుక్కలు చూయిస్తున్నాయి. గత కొంత కాలంగా.. ప్రతి రోజూ, ప్రతి వారమూ, ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సరికొత్త జీవన కాల గరిష్టాల్ని నమోదు చేస్తూనే ఉన్నాయి. దీంతో సామాన్యులకు బంగారం అందకుండా పోతోంది. కొద్ది రోజుల కిందట 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1 లక్ష దాటితేనే బెంబేలెత్తిపోతే.. తర్వాత 22 క్యారెట్ల గోల్డ్ జువెల్లరీ రేటు కూడా రూ. 1 లక్ష ఎప్పుడో దాటేసింది. మరో రూ. 15 వేలు కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు ఆభరణాల బంగారం ధర తులం రూ. 1.14 లక్షలు దాటింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములు రూ. 1.25 లక్షలు దాటేసింది. ఇక గత 8 వారాలుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. ఈ వారంలోనే ఏకంగా 3 శాతం వరకు బంగారం ధర పెరిగింది.
>> అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు (31.10 గ్రాములు) ఈ వారమే 4 వేల డాలర్ల మార్కును దాటేసింది. 4060 డాలర్ల దగ్గర ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. అంతర్జాతీయ అనిశ్చితి, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం రేటు పెరుగుతూనే ఉందని చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు చూసినట్లయితే ఏకంగా 58 శాతం బంగారం ధర పెరిగింది. ఒక సంవత్సరంలో ఇంత మేర పెరగడం 1979 తర్వాత ఇదే తొలిసారి. దీంతో 46 ఏళ్ల రికార్డ్ బద్ధలైందని చెప్పొచ్చు.
బంగారం ధర పెరిగేందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఇక్కడ స్థూల ఆర్థిక పరిణామాలు, టారిఫ్స్ యుద్ధాలు, యూఎస్ డాలర్కు ప్రత్యామ్నాయంగా.. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని విపరీతంగా కొనుగోలు చేస్తుండటం, యూఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుండటం, యూఎస్ గవర్న్మెంట్ షట్డౌన్, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, ఆర్థిక అస్థిరత ఇలా ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా నుంచి వచ్చే వస్తువులు, ఉత్పత్తులపై 100 శాతం దిగుమతి సుంకాల్ని విధిస్తానని హెచ్చరించారు. దీంతో అనిశ్చితి మరింత పెరిగింది. ఇలా ఆపద సమయంలో బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి.. డిమాండ్ పెరుగుతున్న క్రమంలో రేట్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. ఇది మరోసారి యూఎస్- చైనా ట్రేడ్ వార్కు దారితీస్తుందన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లలోనూ పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వెరసి బంగారం ధర ఇంకా పెరుగుతూ వెళ్తోంది.
ఈ క్రమంలోనే బంగారం ధర ఇంకా పెరుగుతుందా అంటే అవుననే సంకేతాలే ఇస్తున్నారు నిపుణులు. యూఎస్ డాలర్ పెరుగుతున్న క్రమంలో బంగారం ధర ఇంకా ఎగబాకే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. సమీప భవిష్యత్తులో ఔన్స్ గోల్డ్ రేటు 4150 డాలర్ల వరకు చేరొచ్చని.. దేశీయంగా చూస్తే ఇది రూ. 1.27 లక్షల వరకు వెళ్లొచ్చని చెబుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇజ్రాయెల్- హమాస్ సంఘర్షణ మొదలైన 2023 చివరి నుంచి.. వరుసగా 9 త్రైమాసికాలు బంగారం ధర పెరుగుతూనే వచ్చింది. ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై తన ధోరణి మార్చుకోనంత వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa