ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 07:37 PM

టీవీకే అధినేత విజయ్ కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఈ విచారణ పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని సైతం నియమించింది. ఇందులో సభ్యులుగా తమిళనాడు కేడర్‌కు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉండాలని, అయితే వారు ఆ రాష్ట్రానికి చెందినవారు కాకూడదని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అంతేకాదు, మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ సీబీఐ విచారణకు నిరాకరించడంపై ప్రశ్నించింది. తొక్కిసలాట ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.


సెప్టెంబరు 27న టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సభా ప్రాంగణం 10 వేల మంది సామర్థ్యం అయితే 30 వేల మందికిపైగా హాజరయ్యారు. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి, నీళ్లు, ఆహారం సహా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.


ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉండగా.. రాత్రి 7 గంటలకు వచ్చారు. దీంతో ఆయన వచ్చేసరికి జనం రద్దీ పెరిగిపోయింది. తన ప్రచార రథం వెంట కూడా వాహనాల్లో జనసమూహాన్ని తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో చాలా మంది చెట్లు,ఇంటి పైకప్పులు, విద్యుత్ స్తంభాలు ఎక్కారు. దీని కారణంగా వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సిల్సి వచ్చింది. విజయ్ రాకతో తోపులాట మొదలై.. ఆయన దృష్టిని ఆకర్షించడానికి ప్రచార బస్సుపై చెప్పులు విసిరారు. ఆ సమయంలో చాలా మంది స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత పోలీసులు జనాన్ని చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేశారని అధికారులు తెలిపారు.


ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు విజయ్ రూ.20 లక్షలు చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. అంతేకాదు, రాష్ట్ర పర్యటన కూడా ఆయన రద్దుచేసుకున్నారు. అక్టోబరు 7న బాధితులకు ఆయన వీడియో కాల్ చేసి ఓదార్చారు. త్వరలోనే వారిని నేరుగా కలుస్తానని ఆయన మాట ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. టీవీకే కరూర్ జిల్లా సెక్రెటరీని అరెస్ట్ చేశారు. అలాగే, టీవీకే ప్రధాన కార్యదర్శి, జాయింట్ సెక్రెటరీలపై కూడా కేసు నమోదుకాగా.. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa