పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో సామూహిక అత్యాచారానికి గురైన 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని తండ్రి తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కూతురి ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ.. ఆమెకు మెరుగైన చికిత్స, రక్షణ అందించేందుకు తక్షణమే ఒడిశా రాజధాని భువనేశ్వర్కు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి హృదయపూర్వక విజ్ఞప్తి చేశారు.
బాలాసోర్ జిల్లాలోని జలేశ్వర్కు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు.. ఈ దారుణం గురించి తెలియగానే హుటాహుటిన పశ్చిమ బెంగాల్కు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి దుర్గాపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈక్రమంలోనే "నా కూతురిని భువనేశ్వర్కు తరలించేందుకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని కోరుతున్నాను. ఆమె ప్రాణాలకు ప్రమాదం ఉందని నేను భయపడుతున్నాను" అని ఆమె తండ్రి ఆదివారం తెలిపారు. తాము పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా లేమని, ఎవరినీ నమ్మడానికి వీల్లేదని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతటితో ఆగకుండా నిందితులు తన కుమార్తెను చంపేస్తారని.. ఆమె ఆరోగ్యం మెరుగైనప్పటికీ ప్రాణాలకు ప్రమాదం ఉందని అన్నారు. తాను స్థానిక అధికారులను నమ్మలేనని చెప్పారు. ప్రస్తుతం తాను దుర్గాపూర్లో ఎక్కడో దాక్కుని ఉన్నానని.. తన డయాబెటిక్ భార్య మాత్రం ఆసుపత్రిలో తమ కూతురి పక్కనే ఉండి చూసుకుంటున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి మాఝీయే స్వయంగా శనివారం రాత్రి బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడారు. ఆయన ఆదేశాల మేరకే బాలాసోర్ అధికారుల బృందం ఆసుపత్రిని సందర్శించిన తర్వాత.. బాధితురాలి తండ్రి ఒడిశా ప్రభుత్వాన్ని బహిరంగంగా సహాయం కోరారు.
తమ కుమార్తెపై అత్యాచారం జరిగి నరకం చూస్తుంటే.. ముఖ్యమంత్రి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. విద్యార్థినులు రాత్రిపూట క్యాంపస్ నుంచి బయటకు వెళ్లకూడదని వ్యాఖ్యానించినట్లుగా వచ్చిన వార్తలపై స్పందిస్తూ ఈ కామెంట్లు చేశారు. కావాలనే ఈ ఘటనను అణిచివేయడానికి ప్రయత్నం జరుగుతోందని తాను భావిస్తున్నట్లు వివరించారు. తన కుమార్తె అర్ధరాత్రి బయటకు వెళ్లలేదని.. ఆమె వెళ్లింది రాత్రి 8 గంటలకేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా దాడి సమయంలో తన కూతురితో ఉన్న ఆమె స్నేహితుడు పారిపోయిన తర్వాత ఎవరికీ చెప్పకుండా ఉండిపోయాడని ఆరోపించారు.
బాలాసోర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ హేమంత్ సింగ్ ఆసుపత్రిని సందర్శించిన తర్వాత మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ పోలీసులు 36 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని అన్నారు. దీనిపై తమకు సంతృప్తి ఉందని తెలిపారు. బాధితురాలికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా సామాజిక సంక్షేమ అధికారి జ్యోత్స్నా మొహంతి నేతృత్వంలోని బాలాసోర్ జిల్లా యంత్రాంగం నుంచి వచ్చిన నలుగురు సభ్యుల బృందం కూడా కుటుంబాన్ని కలుసుకుందని చెప్పారు. బాధితురాలి పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వివరించారు. ఒడిశా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తాము హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులతో సమన్వయం కొనసాగిస్తున్నామని మొహంతి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa