విమాన ప్రయాణికులకు ప్రభుత్వ రంగ సంస్థ అలయన్స్ ఎయిర్ ఒక శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు మారిపోయే టికెట్ ధరల ఒత్తిడి నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో 'ఫేర్స్ సే ఫుర్సత్' అనే వినూత్న పథకాన్ని ప్రారంభించింది. సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా, అలయన్స్ ఎయిర్ ఛైర్మన్ అమిత్ కుమార్, సీఈఓ రాజర్షి సేన్ హాజరయ్యారు.ఈ పథకం కింద, బుకింగ్ తేదీతో సంబంధం లేకుండా టికెట్ ధర స్థిరంగా ఉంటుంది. చివరి నిమిషంలో, అంటే ప్రయాణించే రోజున టికెట్ కొనుగోలు చేసినా అదే ధర వర్తిస్తుందని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్గా అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 31 వరకు ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.ప్రస్తుతం భారత విమానయాన రంగంలో 'డైనమిక్ ప్రైసింగ్' విధానం అమల్లో ఉంది. దీనివల్ల డిమాండ్, పండగ సీజన్లు, పోటీని బట్టి టికెట్ ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇది ప్రయాణికులకు, ముఖ్యంగా చివరి నిమిషంలో ప్రయాణించేవారికి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించి, ధరలలో పారదర్శకత, స్థిరత్వం తీసుకురావడమే 'ఫేర్స్ సే ఫుర్సత్' ముఖ్య ఉద్దేశం.ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, ఉడాన్ పథకం స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. 'ఒకే మార్గం, ఒకే ధర' అనే సాహసోపేతమైన అడుగు వేసిన అలయన్స్ ఎయిర్ను అభినందిస్తున్నాను. ఇది లాభాపేక్షను పక్కనపెట్టి, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వడమే" అని అన్నారు.తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆయన తెలిపారు. విమానాశ్రయాల్లో రూ.10కే టీ, రూ.20కే కాఫీ, స్నాక్స్ అందించే 'ఉడాన్ యాత్రి కేఫ్'ల ఏర్పాటు కూడా ఇందులో భాగమేనని గుర్తుచేశారు. ఇప్పుడు టికెట్ ధరల సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ స్థిర ధరల విధానం వల్ల చిన్న పట్టణాల నుంచి మొదటిసారి విమానమెక్కేవారి సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.డీజీసీఏ ఆగస్టు నెల గణాంకాల ప్రకారం, అలయన్స్ ఎయిర్ 0.3% మార్కెట్ వాటాతో 37,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. సంస్థ లోడ్ ఫ్యాక్టర్ 68.7%గా నమోదు కాగా, ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 55%తో ఇతర ప్రధాన విమానయాన సంస్థల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అలయన్స్ ఎయిర్ ఫ్లీట్లో 20 విమానాలు ఉండగా, వాటిలో 8 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa