భారత సైన్యానికి చెందిన పశ్చిమ కమాండ్ అధిపతి, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ దాయాది దేశం పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని 26 మంది అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి తరహా దుశ్చర్యకు పాకిస్థాన్ మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందని చెబుతూనే.. ఆ పని చేస్తే ఆపరేషన్ సిందూర్ 2.O అమలు చేస్తామని వివరించారు. అంతేకాకుండా సరిహద్దుల్లో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డా.. భారత్ నుంచి మరింత శక్తివంతమైన ప్రతీకారం ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పశ్చిమ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి భారత్ చేపట్టిన భారీ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ అయిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి లెఫ్టినెంట్ జనరల్ కటియార్ మాట్లాడారు. ‘ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు తగిన సమాధానం ఇచ్చామని అన్నారు. అయితే పాకిస్తాన్ తన దుష్ట మార్గాన్ని ఎప్పటికీ మార్చుకోలేదని చెప్పారు. అందుకే పహల్గాం తరహాలో మరో దాడికి పాకిస్థాన్ పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు. ఈక్రమంలోనే పాక్ కదలికలన్నింటిపై మేము నిఘా పెట్టామని చెప్పారు. అంతటితో ఆగకుడా పాక్ సరిహద్దుల్లో మరోసారి దుస్సాహసానికి పాల్పడితే.. భారత్ నుంచి మరింత గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని లెఫ్టినెంట్ జనరల్ నొక్కి చెప్పారు.
పాకిస్థాన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం భారత దేశంతో ఘర్షణను కొనసాగించాలని కోరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మరో దుశ్చర్యకు పాక్ పాల్పడకుండా ఉంటుందని తాను కచ్చితంగా చెప్పలేనని.. అందుకే భారత సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉందని తెలిపారు. అంతేకాకుండా ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని కూడా స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రారంభించిన ఈ ఆపరేషన్ సిందూర్ ప్రధాన లక్ష్యం నియంత్రణ రేఖ వెంబడి చొరబడే ఉగ్రవాద బృందాలను నిలువరించడం, అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయడం అని స్పష్టం చేశారు.
ఈ నెల ప్రారంభంలోనే భారత వైమానిక దళాధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఒక కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దాడుల్లో కనీసం పన్నెండు పాకిస్థానీ సైనిక విమానాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. భారత నష్టాలపై ఇస్లామాబాద్ చేస్తున్న వాదనలు ‘కల్పిత కథలు’ మాత్రమే అని కొట్టిపారేశారు. అలాగే భారత్ చేసిన వైమానిక దాడుల్లో పాకిస్థాన్కు చెందిన భారీ సంఖ్యలో సైనిక మౌలిక సదుపాయాలు నాశనం అయ్యాయని వివరించారు.
వీటిలో మూడు ప్రాంతాలలో ఉన్న హ్యాంగర్లు, కనీసం నాలుగు ప్రాంతాలలో ఉన్న రాడార్లు, రెండు సైట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రెండు ఎయిర్ బేస్లలోని రన్వేలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరోసారి భారత్పై దాడి చేస్తే ప్రపంచ పటంలో ఆ దేశమే లేకుండా చేస్తామని అన్నారు. ఇప్పుడు తాజాగా లెఫ్టినెంట్ జనరల్ కూడా వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa