ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతిపక్ష నేత మరియాకు నోబెల్ బహుమతి.. నార్వేపై వెనుజులా ప్రతీకారం

international |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 10:54 PM

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి వెనుజులా హక్కుల కోసం పోరాడిన మరియా కొరినా మచాడోను ఎంపిక చేసిన సంగతి తెలిసింది. అయితే, ఆమెను నోబెల్‌కు ఎంపిక చేయడంపై సొంత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ. ప్రతీకార చర్యలకు దిగింది. ఈ క్రమంలో నార్వేలోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు వెనుజులా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఎటువంటి కారణాలు లేకుండానే ఎంబసీ మూసివేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అయితే, తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెనుజులా పేర్కొంది.


వెనెజులా తీరుపై నార్వే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది తీవ్ర విచారకరమని నార్వే విదేశాంగ శాఖ పేర్కొంది. అంతేకాదు, చాలా అంశాల్లో తమ మధ్య విబేధాలు ఉన్నప్పటికీ.. వెనెజులాతో తాము సత్సంబంధాలను కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా తమ దేశం పనిచేస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో నోబెల్‌ బహుమతి ప్రకటించడం అనేది నార్వేకు చెందిన స్వతంత్ర నిర్ణయమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తేల్చిచెప్పారు.


వెనెజులా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటానికి గుర్తింపుగా మారియా మచోడాను నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు నోబెల్‌ కమిటీ పేర్కొంది. ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. పన్నెండేళ్లుగా అధ్యక్షుడిగా మదురో కొనసాగుతున్నా.. ఆయన ఎన్నికను అమెరికా సహా పలు దేశాలు గుర్తించలేదు. మచోడా గతేడాదిలో ఎక్కువ కాలం అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చింది.


ఇక, ఆమెకు నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించడంపై మదురో ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే రాయబార కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక, తనకు వచ్చిన నోబెల్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు అంకితమిస్తున్నట్లు మారియా మచోడా ప్రకటించారు. అంతేకాదు, ఈ అవార్డు తన రాజకీయ ఉద్యమానికి ఓ టానిక్ లాంటిందని ఆమె అభిప్రాయపడ్డారు. నోబెల్ అవార్డు రావడం ‘మనం ఒంటరి కాదని గ్రహించడం వల్ల వెనిజులా ప్రజలపై శక్తిని, ఆశను, బలాన్ని నింపుతుంది’ అని అన్నారు. మరోవైపు, ఆస్ట్రేలియాలోని దౌత్య కార్యాలయాన్ని వెనుజులా మూసివేసి, జింబాబ్వే, బుర్కినో ఫెసోలో రాయబార కార్యాలయాలను తెరిచింది. ఆధిపత్య ఒత్తిళ్లకు వ్యతిరేకంగా పోరాటంలో వ్యూహాత్మక భాగస్వాములని పేర్కొంది. వాస్తవానికి నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందని అమెరికా అధ్యక్షుడు భావించారు. తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని, శాంతి బహుమతి అందుకునే అర్హతలు తనకు ఉన్నాయని ట్రంప్ ప్రచారం చేసుకున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa