ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గూగుల్‌ డేటా సెంటర్ ఏర్పాటుపై వాస్తవాలు ఇవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 12:16 PM

విశాఖలో గూగుల్ సంస్థను ముందుపెట్టి డేటా సెంటర్‌ ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందానికి సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారం జాస్తి... దీనివల్ల యువతకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు నాస్తి... అని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందంలో రూ.22 వేల కోట్ల రాయితీలను ఇచ్చేందుకు ఒప్పుకున్న సీఎం చంద్రబాబు, దాని వల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే నిజాన్ని ఎందుకు వెల్లడించలేక పోతున్నారని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే మేం పెట్టుబడులకు వ్యతిరేకం అంటూ మాపై బుదరచల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సీఎంగా వైయస్ జగన్ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ఉద్యోగాల కల్పన స్వల్పంగా ఉంటుందని గ్రహించే, అనుబంధ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దానిలో భాగంగానే ఆనాడే ఆదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ఏపీ ప్రయోజనాలకు పెద్ద పీట వేశారని వెల్లడించారు. అయన మాట్లాడుతూ.... విశాఖపట్నంలో గూగుల్‌కు చెందిన సంస్థతో డేటా సెంటర్ ఏర్పాటుపై కుదుర్చుకున్న ఒప్పందంపై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. వాస్తవానికి ఆదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆదానీ పేరును బయటపెట్టకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే సీఎంగా వైయస్ జగన్ హయాంలోనే ఆదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు పునాది పడింది. ఈ మేరకు భూముల కేటాయింపు, అనుమతుల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఆనాడు ఆ ఒప్పందంతో టెక్నాలజీలో భారీ పెట్టుబడులకు విశాఖను గేట్‌వే గా మార్చేందుకు సీఎంగా వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ అనుబంధం సంస్థలను ప్రోత్సహించడం ద్వారా భారీ ఉద్యోగ కల్పన జరగాలని కూడా సంకల్పించారు. ఒకవైపు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, మరోవైపు భారీగా ఉద్యోగాలను సృష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆదానీతో ఆనాడు చేసుకున్న ఒప్పందంలో సీఎంగా తన పాలనాదక్షతను, నేర్పును వైయస్ జగన్ చాటుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa