రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న 'జీఎస్టీ సూపర్ సేవింగ్స్' ఒక ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన పథకాలు, సంస్కరణలు తీసుకురానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గురువారం కర్నూలు జిల్లా శివారు నన్నూరు సమీపంలో నిర్వహించిన 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్' భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్ర సహాయమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పడిన 'డబుల్ ఇంజిన్ సర్కార్' వల్ల రాష్ట్రానికి రెట్టింపు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు, కేంద్రం తీసుకొచ్చిన సూపర్ జీఎస్టీ తోడవడంతో ప్రజలకు 'సూపర్ సేవింగ్స్' రూపంలో లబ్ధి కలుగుతోందని వివరించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశవ్యాప్తంగా 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని, ఇది ప్రజలపై పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంపై ఇప్పటికే 98 వేల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించామని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. "నేను ఎంతో మంది ప్రధానులతో కలిసి పనిచేశాను, కానీ మోదీ వంటి అసమానమైన నాయకుడిని ఎప్పుడూ చూడలేదు. ఎలాంటి విశ్రాంతి లేకుండా దేశ ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన మనందరి భవిష్యత్తును కాపాడే నాయకుడు. సరైన సమయంలో దేశానికి లభించిన సరైన నేత మోదీ," అని అన్నారు. పాతికేళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా సేవలో స్థిరంగా నిలిచిన మోదీకి ఈ 21వ శతాబ్దం చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.ప్రధాని మోదీ దార్శనికత వల్లే 2047 నాటికి ప్రపంచంలో భారత్ను అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని చంద్రబాబు కొనియాడారు. ఆయన నాయకత్వంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరిందని గుర్తు చేశారు. మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెప్పే వ్యక్తి మోదీ అని, 'ఆపరేషన్ సిందూర్' ద్వారా దేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ, పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం-2, పెన్షన్ల పెంపు వంటి సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి నేతలకు మద్దతు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa