ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వారికి .. రూ.1500 కోట్లు విడుదల,,,చంద్రబాబు నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 06:55 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు కూడా చేపడుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసే కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు వివరిస్తూ.. వివిధ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ చర్యలతో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ సంస్థలతో పాటుగా లులూ గ్రూప్ వంటి విదేశీ కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం తక్కువ ధరకు భూములు కూడా కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.


దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీలోని పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు తీపికబురు వినిపించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఏపీ ప్రగతిలో భాగస్వామ్యులైన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తొలి విడతగా రూ.1500 కోట్లు విడుదల చేయనున్నట్లు చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు.


"చీకటిని తరిమేస్తూ వెలుగులు నింపేదే దీపావళి పండుగ. అలాంటి ఈ పండుగ వేళ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలివిడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది." అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


మరోవైపు పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా - ఇండియ సీఈఓ ఫోరం డైరెక్టర్ మెక్ కే‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ ఇండస్ట్రియల్‌ క్లస్టర్లలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించాలని కోరారు. అనంతరం తెలుగు డయాస్పోరా సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ ఎన్ఆర్ఐలు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం పాటుపడదామన్నారు.


మరోవైపు ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన16 నెలల కాలంలో మన రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని నారా లోకేష్ వెల్లడించారు. ఐదు సంవత్సరాల కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నారా లోకేష్ వివరించారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అగ్రస్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఏపీలో ఉన్నది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని నారా లోకేష్ అభివర్ణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa