ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుకు లాభాల పంట.. ఒక్కసారి నాటితే.. వందేళ్లు దిగుబడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 07:05 PM

వ్యవసాయం అంటే ప్రకృతితో జూదం ఆడటం లాంటిదే. వాతావరణం మొదలు వాడే విత్తనాలు, వేసే మందులు ఇలా ప్రతిది పంట దిగుబడి మీద ప్రభావం చూపుతాయి. ఒకవేళ అన్ని కలిసి వస్తే.. మార్కెట్‌లో ధర ఉండదు. అయితే ఈ సమస్య ఎక్కువగా సంప్రాదాయ పంటల సాగు విషయంలోనే ఎదురవుతుంది. అలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించి... ఇతర పంటల సాగు మీద రైతులు దృష్టి సారిస్తే.. పెట్టుబడి ఖర్చులు కలిసి రావడం మాత్రమేకాకఏళ్ల తరబడి ఆదాయం పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది. అనంతపురం రైతులు ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఒక్కసారి సాగు చేస్తే.. వందేళ్ల పాటు దిగుబడి ఇచ్చే పంటల సాగును ఎంచుకున్నారు. ఆ వివరాలు..


ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల జీవితాల్లో వక్క సాగు వెలుగులు నింపుతుంది. జిల్లా వ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో వక్క సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు పలువురు రైతులు. మరీ ముఖ్యంగా జిల్లాలోని అగళి, అమరాపురం, కుందుర్పి, మడకశిరి, గుడిబండ, కళ్యాణదుర్గం, శెట్టూరు వంటి మండలాల్లో.. దాదాపు 5 వేల ఎకరాల్లో వక్క సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో వక్క సాగుకు అనుకూలమైన వాతావరణం ఉండటమే కాక.. ఈ రైతులు సేంద్రియ పద్ధతుల్లో పంట సాగు చేస్తూ.., తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తూ.. ఆర్థికంగా ఎదుగుతున్నారు.


నీటి వసతి పుష్కలంగా ఉన్న ఏ నేలలో అయినా వక్కను పండించవచ్చు. ఒక్కసారి ఈ పంటను నాటితే వందేళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఎకరాకు 400-500 మొక్కలు నాటుకోవచ్చు. రెండేళ్ల వయసున్న మొక్కలను నాటితే కేవలం నాలుగు సంవత్సరాల్లోనే పంట చేతికి వస్తుంది. ఆగస్టు నుంచి జనవరి వరకు మొత్తం 5 విడతల్లో పంట కోస్తారు. చల్లటి వాతావరణం వక్క దిగుబడిని పెంచుతుంది అంటున్నారు రైతులు. అందుకే వారు వక్క పంట చుట్టూ.. అవిస, బూర మొక్కలను నాటుతున్నారు. దీని వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక పంట సాగులో.. పశువుల పేడ, సేంద్రియ ఎరువులు వాడితే అదిక దిగుబడి వచ్చి.. మంచి లాభాలు వస్తాయంటున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని అగళి, అమరాపురం మండలాల్లో.. 60 నుంచి 100 ఏళ్ల వయసున్న తోటల్లో ఇప్పటికి కూడా దిగుబడి తగ్గలేదని రైతులు చెప్పుకొచ్చారు.


వక్క సాగు విషయానికి వస్తే.. ఈ మొక్కలు నాటడానికి ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇక ఆదాయం విషయానికి వస్తే.. బయటక బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ వక్క ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు పలుకుతోంది. ఎకరాకు ఎంత లేదన్నా.. 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తే రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుంది.


వక్కతో పాటు మిరియాలు, తమలపాకులు అంతర పంటలుగా సాగు చేస్తే అదనపు ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది అంటున్నారు ఈ పంటను సాగు చేస్తున్న రైతులు. వక్కను ప్రాసెస్‌ చేసిన తర్వాత మిగిలిపోయే గుజ్జును కిలో రూ.150 చొప్పున అమ్ముతున్నారు. వక్క మట్టలతో ప్లేట్లు తయారు చేయడం వల్ల స్థానికులకు ఉపాధి లభిస్తోంది. కనుక రైతులు ఇలాంటి ప్రత్యామ్నయం పంటల సాగు మీద దృష్టి సారించాలంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa