ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ ఫ్రెండ్స్‌కు భారత్ షాక్.. టర్కీ, అజర్‌బైజాన్‌కు 70 శాతం తగ్గిన టూరిస్ట్‌లు

international |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 08:05 PM

పహల్గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. ఈ ఆపరేషన్ వేళ చాలా దేశాలు భారత్‌వైపు నిలిచాయి. కానీ కుటిల ఉగ్రవాద దేశం పాకిస్తాన్‌కు తుర్కియే, అజర్‌బైజాన్ మద్దకు ఇచ్చాయి. తుర్కియే ఆయుధ నిపుణులు, వ్యూహకర్తలు పాకిస్థాన్‌ వచ్చి యుద్ధంలో ప్రత్యక్ష సాయం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ దేశాలు భారతీయుల ఆగ్రహానికి గురయ్యాయి. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఇండియా నుంచి ఆయా దేశాలకు వెళ్లే పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాజా గణాంకాల ప్రకారం అజర్‌బైజన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య 70 శాతం పడిపోగా, తుర్కియేకు 38 శాతం తగ్గింది.


గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు దేశాలకు భారతీయులు అధికంగా వెళ్తున్నారు. అనంతరం ఈ దేశాలు భారత్‌లో భారీ ప్రచారం చేసి పర్యటకులను ఇంకా ఆకర్షించాయి. ఇక ఈ దేశాలకు భారత్‌ నుంచి డైరెక్ట్‌ ఫ్లైట్లు ఉండటం కూడా కలిసొచ్చింది. అంతేకాకుండా అజర్‌బైజన్‌ ప్రభుత్వ టూరిజం బోర్డు.. భారత మార్కెట్‌ను కీలకంగా గుర్తించింది.


ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ దేశాలను భారతీయ పర్యటకులు బహిష్కరించారు. మే నుంచే బుకింగ్స్‌ను రద్దు చేసుకున్నారు. దీనికి తోడు ఆన్‌లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్‌లు మేక్‌ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్.. ఉద్దేశపూర్వకంగానే ఆ దేశాలను వెళ్లొద్దని పర్యటకులను డిస్కరేజ్ చేశాయి. ఆ దేశాలకు అవసరమైతేనే ప్రయాణం చేయాలని పర్యటకులకు సూచనలు ఇచ్చాయి. దీంతో భారత్ నుంచి ఆ దేశాలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.


జూన్- ఆగస్టు 2025 మధ్య అజర్‌బైజాన్‌కు కేవలం 20,631 మంది భారతీయులు మాత్రమే ప్రయాణించారు. 2024లో ఈ సీజన్‌లో 69,576 మంది ప్రయాణించారు. అంటే దాదాపు 70 శాతం తగ్గిందన్నమాట. నెలవారీ డేటా ప్రకారం.. వేసవి సీజన్ అంతా తగ్గుదల కొనసాగింది. జూన్‌లో 9,934 మంది సందర్శకులు (గత సంవత్సరం 28,315), జూలైలో 4,665 మంది (20,124), ఆగస్టులో 6,032 మంది (21,137) వెళ్లారు.


తుర్కియేలో కూడా పర్యటకుల సంఖ్య దాదాపు 38 శాతం తగ్గింది. 2024లో ఇదే సమయంలో 93,963 మంది భారతీయులు వెళ్లగా.. 2025లో 58,544 మందికి పడిపోయింది. జూన్‌లో తుర్కియేని సందర్శించిన భారతీయుల సంఖ్య 24,250 (గత సంవత్సరం 38,307), జూలైలో 16,825 (28,875), ఆగస్టులో 17,649 (26,781) పడిపోయింది. గతంలో అచ్చం ఇలాగే.. భారతీయుల సెగ మల్దీవ్స్‌కు తాకింది. ఆ దేశ పర్యాటకం మొత్తం తలకిందులు అయింది. తర్వాత ఆ దేశం దారిలోకి వచ్చిన సంగతి తెలసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa