ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో కలిసి శ్రీలంక వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది

sports |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 07:35 PM

భారత్‌తో కలిసి టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్  ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2025 లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్) టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీ నిర్వహణకు స్టేడియాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.షెడ్యూల్ ప్రకారం ఎల్‌పీఎల్ ఆరో ఎడిషన్ డిసెంబర్ 1న ప్రారంభమై, 24 మ్యాచ్‌లతో ముగియాల్సి ఉంది. అయితే, 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ఆతిథ్య వేదికలను ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఎస్‌ఎల్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్‌పీఎల్‌ను వాయిదా వేయడం ద్వారా స్టేడియాల ఆధునీకరణ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.ప్రపంచ కప్ కోసం కొలంబో, క్యాండీ, దంబుల్లాలోని మూడు స్టేడియాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు శ్రీలంక బోర్డు తెలిపింది. ఇందులో భాగంగా ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలు, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లు, శిక్షణా ప్రదేశాల ఆధునీకరణ, అంతర్జాతీయ స్థాయి బ్రాడ్‌కాస్టింగ్ సదుపాయాలు, మీడియా సెంటర్ల అభివృద్ధి వంటి పనులు జరుగుతాయని వివరించింది.ప్రపంచ కప్ వేదికల్లో ఒకటైన కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌ల కారణంగా ఆధునీకరణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, అక్కడి మ్యాచ్‌లు ముగిసిన వెంటనే పనులు తిరిగి ప్రారంభిస్తామని ఎస్‌ఎల్‌సీ స్పష్టం చేసింది. ఎల్‌పీఎల్‌ను మరింత అనువైన సమయంలో నిర్వహిస్తామని, తద్వారా దేశంలో ప్రపంచ కప్‌ను విజయవంతంగా నిర్వహించగలమని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa