ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ప్రమాదంలో భర్త మృతి.. 23 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత భార్యకు రూ.4 లక్షల పరిహారం

national |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 07:55 PM

భర్త చనిపోయి ఒంటరైన మహిళ.. 23 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తుండగా.. ఎట్టకేలకు సుప్రీంకోర్టు చొరవతో ఆమెకు న్యాయం దొరికింది. తన భర్త మృతికి పరిహారం కోసం ఆమె కోర్టు మెట్లు ఎక్కగా.. చివరికి ఇన్నేళ్ల తర్వాత ఆమెకు డబ్బులు అందాయి. రైలు ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఆ మహిళ 21 ఏళ్లు న్యాయ పోరాటం చేయగా.. ఎట్టకేలకు 2 ఏళ్ల క్రితం ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అప్పటికే ఆమె న్యాయవాది చనిపోవడం, ఆ మహిళ మరో చోటుకు వెళ్లి స్థిరపడటంతో ఆమెకు పరిహారం అందలేదు. దీంతో జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు.. ఆమె ఎక్కడ ఉన్నా పట్టుకుని.. పరిహారం అందించాలని అధికారులు, పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగి.. చివరికి ఆమెను పట్టుకోవడంతో.. అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


2002లో రైలు ప్రమాదంలో మరణించిన తన భర్త విజయ్ సింగ్ తరపున ఆయన భార్య సాయ్‌నోక్త దేవి పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్, పాట్నా హైకోర్టు ఆమె క్లెయిమ్‌ను తిరస్కరించాయి. చనిపోయిన వ్యక్తికి మానసిక ఆరోగ్యం సరిగా లేదనే నిరాధారమైన కారణంతో ఆమెకు న్యాయం జరగలేదు. ఇక ఈ కేసులో 2023 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పులను పూర్తిగా అంటూ కొట్టేసింది. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి సొంతంగా టికెట్ కొని రైలు ఎలా ఎక్కాడని.. అది అసాధ్యమని కోర్టు స్పష్టం చేసింది.


సాయ్‌నోక్త దేవికి రూ.4 లక్షల పరిహారం, క్లెయిమ్ దాఖలు చేసిన తేదీ నుంచి 6 శాతం వడ్డీతో కలిపి రెండు నెలల్లో ఆ మొత్తాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు రైల్వే శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసులో 2 దశాబ్దాల తర్వాత తీర్పు వారికి అనుకూలంగా వచ్చినప్పటికీ.. సాయ్‌నోక్త దేవికి దురదృష్టం వెంటాడింది. ఈ తీర్పుకు సంబంధించిన సమాచారం అందించాల్సిన ఆమె స్థానిక లాయర్ మరణించారు. ఇక తమ కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె తన నివాసాన్ని మార్చడం.. రికార్డుల్లో ఆమె ఊరి పేరు తప్పుగా నమోదు కావడం వల్ల రైల్వే శాఖ పంపించిన లేఖలు ఆమె వరకు చేరలేదు. దీంతో బాధితురాలికి పరిహారం అందించలేక రైల్వే శాఖ తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


భర్త చనిపోయి సామాన్యురాలైన వితంతువుకు న్యాయం దక్కేలా చూసేందుకు సుప్రీంకోర్టు అసాధారణమైన ఆదేశాలు జారీ చేసింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోని ప్రముఖ వార్తాపత్రికలలో ప్రజా ప్రకటన ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నలంద జిల్లా ఎస్పీ, బఖ్తియార్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓలను ప్రత్యేకంగా ఆమె ఆచూకీని ధృవీకరించి పరిహారం గురించి తెలియజేయాలని పేర్కొంది. బిహార్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహాయం తీసుకుని.. ఆమెను వ్యక్తిగతంగా గుర్తించేందుకు ప్రయత్నించాలని ఆదేశాలు ఇచ్చింది.


రైల్వే శాఖ, స్థానిక పోలీసులు చేసిన కృషితో.. ఎట్టకేలకు ఆ సాయ్‌నోక్త దేవి ఆచూకీ లభించింది. తప్పుగా నమోదైన గ్రామం స్థానంలో సరైన గ్రామాన్ని కనుగొని.. ఆమెను, ఆమె కుటుంబాన్ని అధికారులు గుర్తించారు. దీంతో స్థానిక ఎస్‌హెచ్ఓ సహకారంతో రైల్వే అధికారులు ఆ పరిహారం మొత్తాన్ని ఆమె బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశించింది. సర్పంచ్, ఇతర గ్రామ పంచాయతీ సభ్యులు ఆమెను గుర్తించే ప్రక్రియలో సహాయం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు నవంబర్ 24వ తేదీన తుది విచారణకు రానుంది. అయితే న్యాయం ఆలస్యం కావడంతో న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని కొందరు చేసే ఆరోపణలకు ఇలాంటి తీర్పులు చెక్ పెట్టనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa