సముద్రంలో వేటకు వెళ్లి.. వలలో పడిన చేపలను అమ్ముకుని జీవించడమే మత్స్యకారులకు తెలిసిన పని. ఇలా సముద్రంలోకి వెళ్లి.. మన దేశ సముద్ర జలాలను దాటి.. ఇతర దేశాల పరిధిలోకి వెళ్లి అక్కడి కోస్ట్గార్డులకు చిక్కి.. ఏళ్ల తరబడి విదేశీ జైళ్లలో మగ్గిపోతున్నవారు చాలా మందే ఉన్నారు. వారిని ఆయా దేశాల ప్రభుత్వాలతో చర్చలు జరిపి.. వారిని వెనక్కి తీసుకువస్తూ ఉంటారు. అయితే పొరపాటున విదేశీ జలాల్లోకి వెళ్లిన వారు.. స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బతుకుదెరువు కోసం సముద్రంలో వేటకు వెళ్లిన ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళం అధికారులకు పట్టుబడటం తీవ్ర కలకలం సృష్టించింది.
తమ వారు ఇలా చిక్కుకుపోవడం పట్ల ఆ మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా సంయుక్తంగా అత్యవసర చర్యలు చేపట్టాయి. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలం తిప్పలవలస, భోగాపురం మండలం కొండ్రాజుపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు జీవనం కోసం వైజాగ్కు వలస వెళ్లి అక్కడే చేపల వేట కొనసాగిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన విశాఖ చేపలరేవు నుంచి (బోటు నెం. ఎంఎం75)పై వీరు సముద్రంలోకి వేటకు వెళ్లారు.
అయితే దురదృష్టవశాత్తు అక్టోబర్ 14వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో వారు దారితప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ పరిధిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దీంతో 8 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ నేవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం రక్షణ కవచంలా ఉంటుందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.
అదే సమయంలో.. ఈ విషయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. విజయనగరం జిల్లా మత్స్యకారులను క్షేమంగా తిరిగి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంపై ఆయన బుధవారం రాత్రి విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. బంగ్లాదేశ్ ఎంబసీ, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రత, చట్టం, రక్షణ వ్యవహారాలు చూసే కోస్ట్ గార్డ్ వ్యవస్థతో కూడా ఈ సమస్యపై మాట్లాడినట్లు రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రస్తుతం 8 మంది మత్స్యకారులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కృషి చేస్తుండటంతో బాధిత కుటుంబాలు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రభుత్వ అధికారులు, మత్స్యకారుల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa