2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఆస్ట్రేడ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టడీ మెల్బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కొత్త తరానికి మార్గదర్శనం చేస్తున్నామని, అంతర్జాతీయ ఉత్తమ బోధనా పద్ధతులతో విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు.21వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ అన్నారు. "సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ఆట ఆధారిత పాఠ్యాంశాలు, ఏఐ ఆధారిత శిక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వంటి వినూత్న కార్యక్రమాలను 'లీప్'లో భాగంగా అమలు చేస్తున్నాం. ఏఐ, అత్యాధునిక టెక్నాలజీల ద్వారా విద్యార్థులకు టెక్నికల్, లీడర్షిప్, నిజ జీవిత నైపుణ్యాలు అందిస్తున్నాం. జాతీయ విద్యా విధానం లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను సవరించాం. అన్ని స్థాయుల్లో నైతిక విలువలకు పెద్దపీట వేస్తున్నాం" అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa