ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన భారత్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 25, 2025, 09:09 AM

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సైన్యం నీడలో నడిచే పాకిస్థాన్‌కు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి భావనలు అస్సలు తెలియవని, కశ్మీర్‌కు ఆ ఆదర్శాలే ప్రాణమని ఘాటుగా వ్యాఖ్యానించింది. పాక్ అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాల్లో (పీఓకే) జరుగుతున్న అణచివేతను వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పి. హరీశ్ శుక్రవారం మాట్లాడారు. "జమ్మూకశ్మీర్ ప్రజలు భారత రాజ్యాంగ చట్రంలో, ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం తమ ప్రాథమిక హక్కులను వినియోగించుకుంటున్నారు. అయితే, ఈ భావనలు పాకిస్థాన్‌కు ఏమాత్రం పరిచయం లేనివని మాకు తెలుసు" అని ఆయన అన్నారు. పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో జరుగుతున్న తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్కడి ప్రజలు పాక్ సైనిక ఆక్రమణ, అణచివేత, వనరుల దోపిడీపై బహిరంగంగానే తిరుగుబాటు చేస్తున్నారని గుర్తుచేశారు.అంతకుముందు, పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ 1948 నాటి ప్రజాభిప్రాయ సేకరణ తీర్మానాన్ని ప్రస్తావించి పాత వాదనను తెరపైకి తెచ్చారు. దీనిని భారత్ బలంగా తిప్పికొట్టింది. 1948 నాటి భద్రతా మండలి తీర్మానం-47 ప్రకారం, పాకిస్థాన్ ముందుగా తాను ఆక్రమించిన ప్రాంతాల నుంచి తన సైన్యాన్ని, పౌరులను ఉపసంహరించుకోవాలని స్పష్టంగా ఉందని హరీశ్ తెలిపారు. ఆ ప్రాథమిక షరతును పాకిస్థాన్ ఎన్నడూ నెరవేర్చలేదని, కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ ప్రస్తావన కాలగర్భంలో కలిసిపోయిందని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa