ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా, పశ్చిమ ప్రకాశం ప్రజల సుదీర్ఘ కల అయిన మార్కాపురం జిల్లా ఏర్పాటు త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఈ అంశంపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ మార్కాపురం జిల్లాను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో ప్రజల ఆనందం అంబరాన్ని తాకింది.
మార్కాపురం కేంద్రంగా ప్రతిపాదిత కొత్త జిల్లాలో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి మరియు మార్కాపురం నియోజకవర్గాలు భాగం కానున్నాయి. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా కేంద్రం మరింత చేరువ కానుంది. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై కూడా పరిపాలనా పర్యవేక్షణ మెరుగుపడే అవకాశం ఉంది. ఇది కేవలం పరిపాలనా విభజన మాత్రమే కాకుండా, ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త దారులు వేస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు.
ఇదిలా ఉండగా, పొరుగున ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం (D)లో (ఒంగోలు కేంద్రంగా) చేర్చాలా వద్దా అనే అంశంపై నవంబర్ 7న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో తలెత్తిన కొన్ని అశాస్త్రీయ విభజనలను సరిదిద్దే దిశగా ప్రభుత్వం చురుగ్గా కసరత్తు చేస్తోంది. అద్దంకి నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
జనగణన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి తుది నివేదికను సమర్పించనుంది. నవంబర్ 7న క్యాబినెట్ సమావేశంలో మార్కాపురం జిల్లా ఏర్పాటుతో సహా ఇతర మార్పులపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేయడంతో పాటు, పరిపాలనా వికేంద్రీకరణకు దోహదపడతాయని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa