ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిపై యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 06:08 PM

ఢిల్లీలో ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య.. ఏకంగా బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను ఆయన వద్ద పనిచేసేటప్పుడు తనను లైంగికంగా వాడుకుని, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కొత్త పరిణామంతో యాసిడ్ దాడి కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది.వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్‌లో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై నిన్న యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీబాయి కాలేజీ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. ప్రధాన నిందితుడు ఇషాన్ యాసిడ్ బాటిల్ తీసుకురాగా, అర్మాన్ అనే మరో వ్యక్తి ఆమెపై యాసిడ్ విసిరాడు. ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బాధితురాలి చేతులకు గాయాలయ్యాయి.బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ముకుంద్‌పూర్ ప్రాంతానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇషాన్ తన సోదరిని వేధిస్తున్నాడని, గత నెలలో ఆమె అతడిని నిలదీసిందని బాధితురాలి సోదరుడు మీడియాకు వెల్లడించాడు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని నార్త్‌వెస్ట్ డీసీపీ భీషమ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, స్వల్ప గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.ఈ క్రమంలోనే నిందితుడి భార్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను బాధితురాలి కుటుంబం ఖండించింది. యాసిడ్ దాడి కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బాధితురాలి బంధువు ఒకరు ఆరోపించారు. ప్రస్తుతం బాధితురాలి తండ్రి పని నిమిత్తం ఊరిలో లేరని తెలిపారు. పోలీసులు ప్రస్తుతం యాసిడ్ దాడి కేసుతో పాటు నిందితుడి భార్య చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపైనా దర్యాప్తు జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa