ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాను వార్తలపై సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలన్న అనిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 08:40 PM

ఏపీకి మొంథా తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, సహాయక చర్యలకు సర్వసన్నద్ధంగా ఉందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని, ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలు సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంచలనాల కోసం తప్పుడు థంబ్‌నెయిల్స్, హెడ్డింగులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె హితవు పలికారు.తుపాను హెచ్చరికలు వెలువడిన నాటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని మంత్రి అనిత తెలిపారు. గత మూడు రోజులుగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేశ్ తో కలిసి తాను కూడా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసేలా పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, సహాయక చర్యలకు అవసరమైన నిధులను కూడా విడుదల చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, మీడియా ద్వారా వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నామని తెలిపారు.విపత్కర సమయాల్లో సమాచారాన్ని వేగంగా చేరవేసే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని మంత్రి అనిత నొక్కిచెప్పారు. అయితే, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలు కేవలం వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టేలా థంబ్‌నెయిల్స్, సంచలన హెడ్డింగులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా ఈ విషయం తమ పరిశీలనలోకి వచ్చిందని, ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల ప్రజల్లో తీవ్ర గందరగోళం, అలజడి నెలకొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు"సంచలనాల కోసం, వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టేలా వ్యవహరించడం చట్టవిరుద్ధం. అభూత కల్పనలు, అవాస్తవాలతో కూడిన సమాచారం తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను, వారి కుటుంబ సభ్యులను మానసికంగా కుంగదీస్తుంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది" అని అనిత స్పష్టం చేశారు. వార్తల కవరేజీలో వాస్తవాలకు అద్దం పట్టేలా వ్యవహరించాలని, ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ఆమె సూచించారు. సమాచార వ్యాప్తిలో కీలకపాత్ర పోషించే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఈ విపత్కర సమయంలో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాలని హోం మంత్రి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa