ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిమ గల చెంబు పేరుతో ,,,,విశాఖపట్నంలో లేడీ డాక్టర్‌కు బురిడీ

Crime |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:13 PM

ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోయాయి.. రైస్ పుల్లింగ్ పేరుతో కొందరు కేటుగాళ్లు అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. చాలామంది అమాయాకంగా నమ్మి ఏకంగా రూ.కోట్లలో నష్టపోయారు. తాజాగా అలాంటి ఘటన మరొకటి జరిగింది. మహిమ గల చెంబు ఉందని చెప్పి హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్‌ను బురిడీ కొట్టించింది ఓ గ్యాంగ్. డాక్టర్ మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఈ ముఠా ఆటకట్టించారు.. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయకు చెందిన కొర్రా బంగార్రాజు, కర్నాటి ప్రసాద్‌ (గుంటూరు ప్రసాద్), పెందుర్తికి చెందిన వనుము శ్రీనివాస్‌‌లు ఓ గ్యాంగ్‌గా ఉన్నారు. ఈ ముగ్గురు ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ లేడీ డాక్టర్‌ను కలిశారు. ఆమెకు మహిమ గల చెంబు తమ దగ్గర ఉందంటూ మాయ మాటలు చెప్పారు. ఆ చెంబు ఖరీదు ఏకంగా రూ.30 కోట్లు విలువ చేస్తుందని నమ్మబలికారు. ఆ చెంబులో డబ్బులు వేస్తే డబుల్ అవుతాయని ఆమెను నమ్మించారు. ఆమె కూడా నిజమని నమ్మి వీళ్లకు విడతలవారీగా డబ్బుల్ని ఇచ్చారు. ఇలా ఈ ముగ్గురు డాక్టర్ దగ్గర నుంచి రూ.కోటిన్నర వరకు వసూలు చేశారు. డబ్బులు తీసుకున్న ఈ ముగ్గురు ఆ తర్వాత డాక్టర్‌‌కు అందుబాటులో లేకుండాపోయారు.


అలా ఆరు నెలలు గడిచిపోయింది.. ఈ ముగ్గురు నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. అలాగే డాక్టర్ ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. అప్పుడు తాను మోసపోయానంటూ ఈనెల 19న ఆరిలోవ పోలీసుల్ని లేడీ డాక్టర్ ఆశ్రయించారు. అప్పుడు ఈ కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఈ చెంబు వ్యవహారంలో ఆరిలోవ హెల్త్‌సిటీలోని ఓ హోటల్, శ్రీకాంత్‌నగర్‌లోని ఓ హోటల్‌లో లావాదేవీలు జరిగాయని ఆధారాలను పోలీసులకు అందజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


ఎట్టకేలకు పోలీసులు ఈ నెల 23న ఆరిలోవ డంపింగ్‌యార్డు దగ్గుర ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విమ్స్‌ మెయిన్ గేటు దగ్గర మరొకర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల దగ్గర నుంచి రూ.2,41,400 డబ్బులతో పాటుగా మొబైల్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ ఇంకా ఎవరినైనా మోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఉన్నత చదవులు చదివిన వారు కూడా ఇలా అమాయకంగా మోసపోవడం విచిత్రంగా ఉంది. మహిమ గల చెంబు పేరుతో డాక్టర్‌ను ఎలా నమ్మించారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa