ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో టెస్ట్ సిరీస్.. డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌతాఫ్రికా జట్టు ప్రకటన

sports |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 09:16 PM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (2025-27) పాయింట్ల పట్టికలో.. భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలుత ఇంగ్లాండ్‌ పర్యటనలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2 తో డ్రా చేసుకోగా.. స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0 తో ఓడించింది. ఇప్పుడు.. డిఫెండింగ్ ఛాంపియన్స్ సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది. వచ్చే నెలలోనే 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇటీవల పాకిస్థాన్ పర్యటనలో 1-1 తో సిరీస్‌ను డ్రా చేసుకున్న.. దక్షిణాఫ్రికా జట్టు బలోపేతంగా కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పుడు భారత్ పర్యటన కోసం.. టెస్ట్ టీమ్‌ను ప్రకటించింది సౌతాఫ్రికా.


భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం.. 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పిక్క కండరాల గాయంతో.. పాకిస్థాన్‌తో సిరీస్‌కు దూరమైన సౌతాఫ్రికా కెప్టెన్.. తెంబా బవుమా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌కు అతడే కెప్టెన్‌గా ఉండనున్నాడు. దాదాపుగా పాకిస్థాన్‌తో సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టునే కొనసాగించారు. బ్యాటింగ్ విభాగంలో ఒక్క మార్పు చేశారు.


బవుమా జట్టులోకి రావడంతో.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్‌ను తప్పించారు. స్పిన్‌కు సహకరించే భారత్ పిచ్‌లపై రాణించగలడన్న నమ్మకంతో.. జుబేర్ హంజాకు టెస్ట్ జట్టులో స్థానం దక్కింది. ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్, సెనురన్ ముత్తుస్వామి ఉన్నారు. కాగిసో రబాడా, కార్బిన్ బాష్, మార్కో యాన్సెన్, పేస్ విభాగాన్ని పంచుకోనున్నారు. పాక్ పర్యటనకు దూరమైన లుంగి ఎంగిడి ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు.


పాకిస్థాన్‌లో రాణించిన తమ ప్లేయర్లు.. భారత్‌లోనూ బాగా ఆడతారని ఆశిస్తున్నట్లు సౌతాఫ్రికా హెడ్ కోచ్ శుక్రి కాన్రాడ్ స్పందించారు. గాయం నుంచి కోలుకున్న బవుమా.. పాకిస్థాన్‌తో ఈ వారం ప్రారంభమయ్యే వన్డే, టీ-20 మ్యాచ్‌లు ఆడడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ కోసం.. ముందుగానే బెంగళూరులో భారత్- ఏ తో జరిగే సన్నాహక మ్యాచ్‌లో సౌతాఫ్రికా- ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.


సౌతాఫ్రికా టెస్ట్ స్క్వాడ్ ఇదే..


తెంబా బవుమా (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, ఐడెన్ మార్‌క్రమ్, కార్బిన్ బాష్, డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, ముల్డర్, ముత్తుసామి, రబాడ, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరిన్నే.


తొలి టెస్ట్ నవంబర్ 14-18 మధ్య కోల్‌కతాలో జరగనుండగా.. రెండో టెస్టు నవంబర్ 22-26 తేదీల్లో గువాహటి వేదికగా జరగనుంది. నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6న 3 వన్డేలు ఆడనుంది. ఇక 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ డిసెంబర్ 9- 19 మధ్య జరగనుంది. వన్డే, టీ-20 జట్టును ఇంకా ప్రకటించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa