మొంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న 12 జిల్లాల్లో నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులను ముందుగానే పంపిణీ చేయాలని ఆదేశించింది. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన ప్రారంభించే ఈ ప్రక్రియను ఈసారి అక్టోబర్ 28వ తేదీ నుంచే అమలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు.తుపాను కారణంగా ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు ఉదయం 9 గంటల నుంచే రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ జిల్లాల పరిధిలోని 14,145 రేషన్ దుకాణాల ద్వారా దాదాపు 7 లక్షల మంది లబ్ధిదారులకు సరుకులు అందజేయనున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, "సాధారణంగా నెల మొదటి రోజు నుంచి రేషన్ పంపిణీ చేస్తాం. కానీ, తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. లబ్ధిదారులకు అందించే బియ్యం, పంచదార వంటి సరుకులను ఇప్పటికే క్షేత్రస్థాయిలోని రేషన్ షాపులకు చేర్చాం. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది" అని భరోసా ఇచ్చారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa