కొన్ని ఘటనల గురించి విన్నప్పుడు భయం వేస్తుంది.. మరికొన్ని వార్తలు విన్నప్పుడు అమ్మబాబోయ్ అనిపిస్తుంది.. ఇంకొన్ని విషయాలు చెవిన పడినప్పుడు.. అబ్బబ్బా.. ఏం తెలివిరా సామీ అనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి గురించి తెలిస్తే.. ఈ మూడో మాట మదిలో మెదలడం పక్కాగా ఖాయం. అసలు అలా ఎలా జరిగిందనే సందేహాలు కూడా మైండ్లో రావటం పక్కా. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సూర్యారావుపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిలుకుదుర్గయ్యవీధిలో ఓ కుటుంబం నివశిస్తోంది. ఈ ఫ్యామిలీలో అందరూ వైద్యులే. దీంతో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారు. అంతా డాక్టర్లు కావటంతో ఆదాయం కూడా బాగానే ఉండొచ్చు.
ఇక కుటుంబంలోని అందరూ వైద్యులు కావటంతో ఇంటి పనులు చేయడం కోసం.. ఓ పనిమనిషిని కూడా నియమించుకున్నారు. వంటపనులు చేసేందుకు మారుతీనగర్కు చెందిన చీపురుపల్లి సుమలత అనే మహిళను రెండేళ్ల కిందట నియమించుకున్నారు. పనిమనిషిగా చేరిన సుమలత మంచిగా పనిచేస్తూ కుటుంబసభ్యుల నమ్మకం సంపాదించుకుంది. వారి వద్ద మంచిపేరు తెచ్చుకుంది. అయితే ఆరు నెలల కింద సుమలత ఇంట్లో పని మానేసింది. నాన్న చనిపోయాడని.. తన ఆరోగ్యం సరిగా లేదంటూ పని మానేస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే..
డాక్టర్ల ఫ్యామిలీకి ఇటీవల ఓ ఫంక్షన్కు వెళ్లాల్సిన పని పడింది. ఇక ఫంక్షన్ అంటే హంగూ ఆర్భాటం, నగానట్రా తప్పనిసరి కదా.. దీంతో ఫంక్షన్కు రెడీ అయ్యేముందు ఇంట్లో నగల కోసం వెతికింది. అయితే ఎక్కడా నగల జాడ లేదు. దీంతో ఇంటి యజమానులు విస్తుపోయారు. ఇంట్లో పెట్టిన బంగారు నగలు ఏమయ్యాయని ఆందోళన చెందారు. ఎంత వెతికినా కనిపించకపోవటంతో చివరకు సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు. ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఈ ఇంట్లో గతంలో పనిచేసి మానేసిన సుమలతపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో సుమలతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే అసలు విషయం వెలుగుచూసింది. దొంగతనం బట్టబయలైంది. డాక్టర్ల ఇంట్లో పనిమనిషిగా ఉన్న సమయంలో సుమలత ఆ ఇంట్లోని బంగారు నగలు కాజేసినట్లు తెలిసింది. పనిమనిషిగా ఉన్న సమయంలో.. ఆ ఇంటి సభ్యులు తమ నగలను డబుల్ కాట్ బెడ్, డ్రెస్సింగ్ టేబుళ్లలో దాచే విషయాన్ని సుమలత గమనించింది. అలాగే వాటికి తాళాలు వేయకపోవటం కూడా గుర్తించింది.
దీంతో వీలుచిక్కినప్పుడల్లా రోజుకో నగ చొప్పున అందులో నుంచి మాయం చేసింది. అలా చోరీ చేసిన బంగారు నగలను బంధువుల ఇళ్లలో దాస్తూ వచ్చింది. చివరకు ఎక్కడ దొరికిపోతానేమోననే భయంతో ఆరు నెలల కిందట పని మానేసింది.మరోవైపు పోలీసుల విచారణలో సుమలత నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు రూ.కోటి విలువైన 837 గ్రాముల బంగారు నగలను ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. సుమలతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa