మొంథా తుపాను నేపథ్యంలో.. రాబోయే 24 గంటల్లో ఏపీలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 పట్టణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. దీంతో ఆయా ప్రాంతాల్లో 2194 రిలీఫ్ క్యాంపులను అధికారులు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతోపాటు.. ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు సైతం ప్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు.
విశాఖపట్నంలో భారీ వర్షం
విశాఖ జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అలాగే ఈదురుగాలుల దెబ్బకు చెట్లు నేలకూలాయి. జ్ఞానాపురం రైల్వే అండర్పాస్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆనందపురం-అనకాపల్లి జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డు నీళ్లలో మునిగింది. ఆరిలోవ రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
విజయవాడలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
విజయవాడపై మొంథా తుపాను ప్రభావం కనిపిస్తోంది. నగరంలో భారీ వర్షం పడుతోంది.. ఇవాళ నగరంలో 16.2 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలపై అలర్ట్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు బయటకు రావొద్దని.. అవసరమైతే షాపులు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని సూచించారు. మెడికల్ షాపులు, కూరగాయలు, పాల విక్రయ షాపులు తెరిచేందుకు అనుమతించారు. వీఎంసీ పరిధిలో 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొండపై నివాసం ఉంటున్నవారిని అలర్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ 9154970454, వీఎంసీ కార్యాలయం 08662424172, 08662422515, 08662427485 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్
తుపాను సమాచారాన్ని ప్రజలకు వివిధ రూపాల్లో అందించాలన్న సీఎం గారి ఆదేశాల మేరకు కోస్తా జిల్లాల్లోని 26 తీరప్రాంత గ్రామాల్లో ప్రయోగాత్మకంగా మొంథా తుపాన్ హెచ్చరికలు రియల్టైమ్ వాయిస్ అలర్ట్లను క్షణాల్లో అందిస్తున్నారు. విద్యుత్ అంతరాయం జరిగినా 360° హార్న్ స్పీకర్ వ్యవస్థ, ఒక కిలోమీటరు పరిధిలో కూడా స్పష్టమైన హెచ్చరికలను అందిస్తుంది. ఈ వ్యవస్థ మరిన్ని గ్రామాల్లో విస్తరించునున్నారు. ప్రజలకు మెసేజెస్, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ కాల్స్, టాంటాంలు, క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా,అన్ని విధాలా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
మూడు రోజులు రైళ్లు రద్దు
తుపాను నేపథ్యంలో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 67 రైళ్లను, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 43 రైళ్లను నిలిపేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య ప్రయాణించే గోదావరి ఎక్స్ప్రెస్తోపాటు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను సైతం నిలిపేశారు.
తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
మొంథా తుపాను నేపథ్యంలో.. తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. తుపాను నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం కాకినాడ తీరానికి పదో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa