ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొంథా తుపాను ఎఫెక్ట్.. రాత్రి 7 గంటల నుంచి వాటిపై ఆంక్షలు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:07 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొంథా తీవ్ర తుపాను వణికిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాను కేంద్రీకృతమై ఉంది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి గంటకు 15 కి.మీ వేగంతో తుపాను కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి మచిలీపట్నంకి 70 కి.మీ, కాకినాడకి 150 కి.మీ, విశాఖపట్నం నగరానికి 250 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.


భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు రహదారులపై ఆంక్షలు విధించారు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల చేయనున్నారు. భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు ముందే సురక్షిత లేబేలో నిలుపుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అప్రమత్తం చేసింది.


  తుపాను ఎఫెక్ట్.. పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు


మరోవైపు మొంథా తీవ్ర తుపాను కారణంగా ఏపీలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనంతపురం, కర్నూలు, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల నేపథ్యంల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. అలాగే సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు మూడు రోజులు సముద్రంలోకి చేపల పాటు వేటకు వెళ్లొద్దని సూచించింది.


ఆ జిల్లాలలో ఆకస్మిక వరదలు..


మరోవైపు మొంథా తీవ్ర తుపాను కారణంగా పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఉదయం వరకూ కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


మరోవైపు తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చెట్టు కూలి ఓ మహిళ చనిపోయింది, మామిడికుదురు మండలం మాకనపాలెంలో చెట్టు కూలి మీద పడటంతో వీరవేణి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మొంథా తీవ్ర తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని నందిగరువులో చెట్టు కూలి కరెంట్ స్తంభాలపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. అలాగే బాపట్ల జిల్లావాడరేవు తీరంలో రాకాసి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa