తమిళనాడు రాష్ట్ర నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలలో ఉద్యోగాల ఎంపికల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని, ప్రభుత్వ ఉద్యోగం కోసం రూ.35 లక్షల దాకా లంచం ఇచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడుతోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆరోపించారు. ఈ మేరకు గురువారం తన ఎక్స్ పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు. నగరపాలన, తాగునీటి సరఫరా శాఖలో ఖాళీ పోస్టుల భర్తీలో భారీ యెత్తున అక్రమాలు జరిగాయని,ఈ అవినీతిలో సుమారు రూ.800 కోట్ల మేరకు అక్రమ నగదు బట్వాడా జరిగిందని ఈపీఎస్ పేర్కొన్నారు. రాష్ట్రమంతటా ఐటీ, ఈడీ జరిపిన సోదాల సందర్భంగా ఈ అవినీతి వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ అవినీతిలో నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ, ఆయన సోదరులకు చెందిన సంస్థల అధికారులు కీలకపాత్ర పోషించారని, ఉద్యోగం కోసం వచ్చినవారి వద్ద రూ.25 లక్షల నుండి రూ.35 లక్షల దాకా లంచాలుగా స్వీకరించారని ఆరోపించారు.దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ జరపాలని ఆయన ఈడీకి విజ్ఞప్తి చేశారు. కాగా ఈపీఎస్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్త వాలని నగరపాలక శాఖా మంత్రి కేఎన్ నెహ్రూ తీవ్రంగా ఖండించారు. నగరపాలక శాఖలో ఉద్యోగాల పేరుతో ఎలాంటి ముడుపులు తీసుకోలేదని, ఈడీ జరిపిన దాడుల్లో గాని, సోదాల్లోగానీ తన శాఖలో అవినీతి అక్రమాలు జరిగినట్టు ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఎలాంటి ప్రకటన కూడా చేయలేదని ఈ సందర్భంగా మంత్రి నెహ్రూ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa