ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా ప్రారంభమైన చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 12:44 PM

కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి (శుక్రవారం) నుంచి ఆరు రోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర సతీసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయానికి వచ్చిన మంత్రికి మేళతాళాలు, పూర్ణ కుంభంతో ఉత్సవ కమిటీ స్వాగతం పలికింది. ఆపై స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దంపతులతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పాండురంగడి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని తెలిపారు. నవంబర్ 2న స్వామి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నామని చెప్పారు. 3న నాగులేరు కాలువలో తెప్పోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే 5వ తేదీన జరిగే కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు కూడా ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa