మొంథా తుఫాన్ బాధితుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్కు లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్కు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాదేమో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు విద్యుత్ శాఖ అప్రమత్తమైందని గొట్టిపాటి తెలిపారు.తుఫాన్ సమయంలో ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దాదాపు 1500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు. నష్టం జరిగిన 24 గంటల్లోనే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించామని తెలిపారు. దాదాపు 13వేల విద్యుత్ స్తంభాలు, 3 వేల కిలోమీటర్లు మేర కండక్టర్లు, 3 వేల మేర ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని మంత్రి వెల్లడించారు.వ్యవసాయ, ఆక్వాకు సంబంధించి వాలిపోయిన విద్యుత్ స్తంభాలు వంటివి మరో 48 గంటల్లో పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి రవికుమార్ తెలిపారు. కొన్ని చోట్ల గాలుల వేగం ఎక్కువగా ఉన్నందునే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. తుఫాన్ సమయంలో విద్యుత్ సిబ్బంది కూడా ప్రాణాలు పణంగా పెట్టి నిర్విరామంగా పని చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రతీ ఒక్క విద్యుత్ సిబ్బందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa