ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలు మద్యం తాగితే జరిగేది ఇదే.. బెంగాల్ ఏఎస్పీ

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:34 PM

పశ్చిమ బెంగాల్‌లోని రానాఘాట్ జిల్లాకు చెందిన అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) లాల్టు హల్దార్ మహిళలపై షాకింగ్ కామెంట్లు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ముఖ్యంగా మహిళలు మద్యం సేవించడంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. లాల్టు హల్దార్ "తప్పు పనులు చేసేది అబ్బాయిలు. వారిని ఆపడం మహిళల పని. కానీ ఇప్పుడు మహిళలే మద్యం తాగుతూ.. వీధుల్లో అల్లరి చేస్తున్నారు. ఇది సమాజానికి హాని కలిగిస్తోంది" అని ఆయన అన్నారు.


ఇలా అయితే సమాజం పిచ్చిదవుతుంది..


గత ఏడాది జరిగిన కాళీ పూజ ఊరేగింపుల సమయంలో యువతులు మద్యం సేవించడం చూసి తాను సిగ్గుపడ్డానని లాల్టు హల్దార్ పేర్కొన్నారు. యువతుల్లో మద్యం సేవించే వారి రేటు అత్యధికంగా పెరిగిందని చెప్పడానికి సిగ్గుపడుతున్నానని అన్నారు. బాలికలు వీధుల్లో నిలబడి మద్యం తాగుతున్నారన్నారు. ఇది ఊరేగింపునకు అందమా అంటూ ప్రశ్నిస్తూనే.. తాను ఈ ఊరేగింపును ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇంట్లోని మహిళలు ఇలా తయారైతే.. సమాజం పిచ్చిది అయిపోతుందని వ్యాఖ్యానించారు. అబ్బాయిలు తప్పు చేస్తే.. వారిని మంచి మాటలు చెప్పి సరిదిద్దేది మహిళలే అన్నారు. కానీ ఆ అమ్మాయిలే అల్లరి చేస్తే.. అప్పుడు సమాజం ఎటు పోతుందో మీరే అర్థం చేసుకోండని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సాంప్రదాయవాద, లింగ వివక్ష ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వివాదం ముఖ్యంగా దుర్గాపూర్‌లోని మెడికల్ కాలేజీ సమీపంలో 23 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్త ఆగ్రహం వ్యక్తమవుతున్న సమయంలో రావడం గమనార్హం. ఆ అత్యాచార ఘటనపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆమె విద్యార్థుల భద్రత బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే ప్రయత్నం చేశారని విమర్శలు వచ్చాయి. "ఆమె ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. బాధ్యత ఎవరిది? రాత్రి 12.30 గంటలకు ఆమె ఎలా బయటకు వచ్చింది?" అని ప్రశ్నించిన మమతా బెనర్జీ.. "ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ విద్యార్థుల పట్ల, రాత్రిపూట వారి 'కల్చర్' పట్ల జాగ్రత్త వహించాలి. వారిని బయటకు అనుమతించకూడదు. వారు తమను తాము రక్షించుకోవాలి. అది అటవీ ప్రాంతం" అని వ్యాఖ్యానించారు.


ఒకవైపు రాష్ట్రంలో మహిళా భద్రతపై ఆందోళనలు పెరుగుతుండగా.. మరోవైపు పోలీస్ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి సైతం మహిళల ప్రవర్తనను ప్రశ్నించే విధంగా మాట్లాడటం ప్రజలల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా బాధితులనే నిందితులుగా చూపించాలా మాట్లాడడం సరికాదని అంటున్నారు. అలాగే ఏఎస్పీ హల్దార్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa