ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు, సీఈవో శామ్ ఆల్ట్మన్కు టెస్లా కంపెనీ నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. తాను ఏడున్నర సంవత్సరాల క్రితం బుక్ చేసుకున్న టెస్లా కారు ఇప్పటికీ డెలివరీ కాలేదని ఆయన శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కారు కోసం తాను 45,000 డాలర్ల రిజర్వేషన్ ఫీజు కూడా చెల్లించినట్లు తెలిపారు.ఇంతకాలం ఎదురుచూసినా కారు రాకపోవడంతో, తన ఆర్డర్ను రద్దు చేసుకుని, డబ్బులు వాపసు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆల్ట్మన్ చెప్పారు. ఈ మేరకు ఆయన టెస్లా కంపెనీకి పంపిన ఈ-మెయిల్కు సంబంధించిన మూడు స్క్రీన్షాట్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.మొదటి స్క్రీన్షాట్లో ఆయన కారు బుక్ చేసుకున్నట్లు ధృవీకరిస్తూ వచ్చిన మెయిల్ ఉంది. రెండో దానిలో తన ఆర్డర్ను రద్దు చేసి, రీఫండ్ ఇవ్వాలని కోరుతూ టెస్లాకు పంపిన ఈ-మెయిల్ ఉంది. అయితే, మూడో స్క్రీన్షాట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన పంపిన ఈ-మెయిల్ "అడ్రస్ నాట్ ఫౌండ్" అనే ఎర్రర్ మెసేజ్తో బౌన్స్ అయినట్లు అందులో ఉంది. ఈ మూడు చిత్రాలను పంచుకుంటూ, "మూడు అంకాల్లో ఒక కథ" అని ఆల్ట్మన్ క్యాప్షన్ పెట్టారు."నిజానికి ఆ కారు కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూశాను. ఆలస్యం కావడం సహజమేనని అర్థం చేసుకోగలను. కానీ, ఏడున్నరేళ్లు వేచి ఉండటం చాలా ఎక్కువ సమయం అనిపించింది" అని ఆయన మరో కామెంట్లో పేర్కొన్నారు.ఈ పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు దీనిపై స్పందించారు. ఈ క్రమంలో శామ్ ఆల్ట్మన్ సోదరుడు జాక్ ఆల్ట్మన్ సరదాగా స్పందించారు. శామ్ పాత ఫొటోను షేర్ చేస్తూ, "50 బిలియన్ డాలర్లు ఖర్చైనా నేను పట్టించుకోను అని చెప్పే నువ్వు, ఇప్పుడు 50 వేల డాలర్ల కోసం ఇంతలా చింతిస్తున్నావ అని ఆటపట్టించారు. దీనికి శామ్ కూడా నవ్వుతూ, "తమ్ముళ్ల తీరే ఇంత" అంటూ చమత్కారంగా బదులిచ్చారు.అయితే, శామ్ ఆల్ట్మన్ పోస్ట్పై టెస్లా కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా, ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా.. గత నెలలో భారత్లో తమ స్టాండర్డ్ మోడల్ వై కార్ల డెలివరీలను ప్రారంభించింది. లాంగ్ రేంజ్ వేరియంట్ డెలివరీలు కూడా త్వరలో మొదలవుతాయని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa