ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ తీవ్ర గాయానికి గురైన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సంబంధించిన కీలకమైన శుభవార్తను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెల్లడించింది. సిడ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన శ్రేయస్ అయ్యర్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. క్యాచ్ పట్టినప్పుడు పక్కటెముకల ప్రాంతంలో తగిలిన దెబ్బ వల్ల అతనికి అంతర్గత గాయాలయ్యాయి, ఈ కారణంగానే కొంతకాలం ఐసీయూలో కూడా చికిత్స పొందాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడంలో వేగం సంతరించుకుందని బీసీసీఐ ప్రకటించింది.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం మెరుగుపడడం పట్ల సిడ్నీ మరియు భారత వైద్య నిపుణులతో కూడిన వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్గత రక్తస్రావాన్ని ఆపడానికి అతనికి ఇటీవల సిడ్నీ వైద్యులు ఒక చిన్నపాటి "మైనర్ ప్రొసీజర్" నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమై, ఆరోగ్యం మెరుగుపడటంతోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే, తదుపరి వైద్య పర్యవేక్షణ (ఫాలోఅప్) కోసం శ్రేయస్ అయ్యర్ కొద్ది రోజులు సిడ్నీలోనే ఉండనున్నారు.
ఈ క్లిష్ట సమయంలో శ్రేయస్కు మెరుగైన చికిత్స అందించిన సిడ్నీ మరియు భారతదేశ వైద్య నిపుణులకు బీసీసీఐ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. సిడ్నీలో ఉన్న డాక్టర్ కౌరూష్ హఘిగి, అతని బృందానికి, అలాగే భారత వైద్య నిపుణుడైన డాక్టర్ దిన్షా పర్దివాలాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ప్రయాణానికి పూర్తిగా ఫిట్గా ఉన్నారని నిర్ధారించిన తర్వాతే అయ్యర్ స్వదేశానికి తిరిగి రానున్నారు.
గాయం కారణంగా కొంతకాలం ఆటకి దూరమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, శ్రేయస్ అయ్యర్ ప్రాణాపాయం నుంచి బయటపడి సురక్షితంగా కోలుకోవడం టీమిండియా అభిమానులకు పెద్ద ఊరట. అతను త్వరగా మైదానంలోకి తిరిగి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకొని మళ్లీ బ్యాట్ పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa