బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి 150కి పైగా సీట్లు వస్తాయని, ఒకవేళ ఆ మార్కును అందుకోలేకపోతే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితమవుతుందని ఆసక్తికర జోస్యం చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికల తర్వాత గానీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పీకే తేల్చి చెప్పారు. "ప్రస్తుతం బీహార్లోని 160-170 స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. మా పార్టీ 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం నాకుంది. రాష్ట్ర ప్రజలు జన్ సురాజ్ను ఓ బలమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తాను ఎన్నికల్లో పోటీ చేయకపోవడం పట్ల ప్రజల్లో కొంత నిరాశ ఉందని పీకే అంగీకరించారు. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. "ఒకవేళ పోటీ చేస్తే కార్గఢ్ నుంచి చేస్తానని గతంలో అన్నాను. కానీ, అది కూడా నిజం కాదని అప్పుడే స్పష్టం చేశాను" అని తెలిపారు. బీహార్లోని మూడింట ఒక వంతు ప్రజలు ప్రస్తుత అధికార, ప్రతిపక్ష కూటములకు ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారని, వారికి తమ పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని పీకే వివరించారు.కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa